Thursday, March 28, 2024

అక్షరజ్ఞానం అందరి హక్కు

- Advertisement -
- Advertisement -

Education is everyone's right

అక్షరం ఆయుధం కన్నా గొప్పది. అక్షరం వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. అభివృద్ధికి బాటలు వేస్తుంది. అయినా అక్షరంపై నిర్లక్ష్యం వీడడం లేదు. సమాజమంతా ఆన్‌లైన్ బాటపడుతున్నా, అ,ఆ,ఇ,ఈ అంటే తెలియని వారు ఎందరో ఉన్నారు. ఇంకా చాలా మంది వేలిముద్రలు వేస్తున్నారంటే మనమెక్కడ ఉన్నామో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అక్షరాస్యతపై లెక్కలు బాగానే ఉన్నా ఆర్థికంగా చేయూత లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం, నిరక్షరాస్యులకు అవగాహన లేమి వెరసి వేలిముద్రకు దారి తీస్తుంది. సాంప్రదాయికంగా, అక్షరాస్యత అంటే భాష ఉపయోగం చేయడానికి, చదవడం, వాయడం, వినడం, మాట్లాడం వంటి నైపుణ్యాలను నేర్చుకోవడం. నవీన దృక్పథంలో సమాచారం కొరకు కావలసిన నాలుగు మూల వస్తువులైనటివంటి చదవడం, వాయడం, వినడం, మాట్లాడడం వంటి వాటిని నేర్చుకునే విధానమే అక్షరాస్యత.

అయితే, రాయడం, చదవటం మాత్రమే అక్షరాస్యత కాదనీ, గౌరవం, అవకాశాలు, అభివృద్ధి గురించి చెప్పడమే నిజమైన అక్షరాస్యత అని కొంతమంది పెద్దలు చెబుతుంటారు. ప్రపంచం అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు విద్య, విజ్ఞానం ఎంతో అవసరం. ఉన్నతమైన జీవనానికి ఇవి ఎంతో ముఖ్యం. 700 మిలియన్ పెద్దలలో కొందరికి కనీస అక్షరాస్యత నైపుణ్యం లేదు. ప్రతి ఐదు మంది పెద్దలలో ఒకరికి, ప్రతి ముగ్గురు మహిళలలో ఇద్దరికి ఈ రోజుకు కూడా అక్షరజ్ఞానం లేదు. ప్రపంచంలోని కొన్ని దేశాలు అన్ని రకాలుగా వెనుబడి ఉండటానికి నిరక్షరాస్యత ముఖ్యకారణంగా చెప్పవచ్చు. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, అక్షరాస్యతను వ్యక్తులు, సంఘాలకు అందించటం. ఇది పిల్లల విద్యపైనేగాకుండా, వయోజన విద్య మీద కూడా కేంద్రీకరించబడుతుంది.

ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోలిస్తే అక్షరాస్యత విషయంలో భారతదేశం ఇంకా దిగువ స్థాయిలోనే వుందని చెప్పవచ్చు. 1965లో యునెస్కో ప్రతిపాదనతో సెప్టెంబర్ 8, 1966న మొట్టమొదటి సారిగా ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం జరుపుకున్నారు. 2003-12 దశకంను యునైటెడ్ నేషన్స్ అక్షరాస్యత దశకంగా యునెస్కో ప్రకటించింది. ఆ దశకం అంతా లిటరసీ ఇనిషియేటివ్ ఫర్ ఎంపవర్మెంట్ ప్రక్రియ ద్వారా అక్షరాస్యుల సంఖ్యను పెంచటానికి కృషి చేసింది. ఢాకాలో జరిగిన కార్యక్రమంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, యునెస్కో డైరెక్టర్ జెనరల్ ఇరిన బొకోవా కలసి 2014 యునెస్కో అంతర్జాతీయ అక్షరాస్యత బహుమతిని అందించారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినం వేడుకలు వివిధ దేశాలలో ప్రత్యేక నేపథ్యాలుగా అందరికీ విద్య అనే లక్ష్యాలను చేరవేసే కృషి చేస్తున్నాయి. ఇతర యునైటెడ్ నేషన్స్ కార్యక్రమాలు యునైటెడ్ నేషన్స్ అక్షరాస్యత డికేడ్ నిర్వహిస్తున్నవి. బీహార్ లాంటి రాష్ట్రాలు, సగటు అక్షరాస్యతా శాతానికి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మొత్తం మీద ప్రపంచ నిరక్షరాస్యుల్లో సగం మంది మనదేశంలోనే ఉండటం విచారకరం. స్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధించాలంటే దేశంలో 80 శాతం అక్షరాస్యత సాధించాల్సిన అవసరం ఉంది.

స్వాతంత్య్రం వచ్చిన 73 ఏళ్లు గడుస్తున్నా 74.04 శాతం అక్షరాస్యతనే సాధించగలిగాము. ఈ సందర్భంగా విద్య ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు వివరించాలి. అందరూ చదివినప్పుడే గ్రామాభివృద్ధి జరుగుతుంది . తలిదండ్రులు విధిగా తమ పిల్లలను బడిలో చేర్పించాలి, బాలకార్మికులుగా మారకుండా చూడాలి. బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం మాదిరిగా ప్రతి ఒక్కరు వయోజనులతో కలిసి చదువుకోవాలన్న చట్టం తేవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్షరాస్యత సాధనలో చిత్తశుద్ధిగా వ్యవహరించాలి. నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేసి ఫలితాలు రాబట్టాలి. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకోవాలి. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. మహిళల అక్షరాస్యత పెంపునకు ప్రత్యేక కార్యక్రమాలు తీసుకోవాలి. వారి కోసం ప్రత్యేక బడులు, కళాశాలలు ఏర్పాటు చేయాలి. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యానుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలి. నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని ఖచ్చితంగా అమలుచేయాలి. 5- 14 ఏళ్ల బాలబాలికలంతా బడిలో ఉండేలా చూడాలి. బాల్య వివాహాలు చేసిన వారిపై చట్టాలను కఠినంగా అమలు చేయాలి.

డాక్టర్ ఎం డి ఖ్వాజా మొయినొద్దీన్
9492791387

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News