Saturday, April 20, 2024

‘వైద్య’ విప్లవం

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశ వైద్య రంగంలో నూతన విప్లవానికి తెలంగాణ శ్రీకారం చుట్టబోతోంది. మంగళవారం ఒకేసారి 8 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కాబోతున్నాయి. ఇది దేశ చరిత్రలోనే అత్యంత అరుదైన సందర్భం. తెలంగాణ ఏర్పడేనాటికి 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఇందులో గాంధీ (1954), ఉస్మానియా (1946) దవాఖానలు ఆం ధ్రప్రదేశ్ ఆవిర్భవించే నాటికే ఉన్నా యి. అంటే.. గత ప్రభుత్వాలు కలిసి 57 ఏండ్లలో ఏర్పాటు చేసినవి కేవలం మూడు మెడికల్ కాలేజీలే. కాకతీయ మెడికల్ కాలేజీని 1959లో ఏర్పాటు చేయగా, ఆ తర్వాత ఆదిలాబాద్‌లో రి మ్స్, నిజామాబాద్‌లో మెడికల్ కాలేజీ లు ఏర్పాటయ్యాయి. మెడికల్ కాలేజీ లు లేక, సూపర్ స్పెషాలిటీ వైద్యం అందక ప్రజలు ఎన్నో కష్టాలు పడేవారు. ఏదైనా పెద్ద వ్యాధి వస్తే చికిత్స పొందాలన్నా.. మెరుగైన వైద్యం దొరకాలన్నా హైదరాబాద్‌కు పరుగెత్తాల్సి వచ్చేది.

వందల కిలోమీటర్లు, గంటల పాటు ప్రయాణించి హైదరాబాద్‌కు చేరుకొని, చికిత్స కోసం వారాలు, నెలల పాటు అ క్కడే ఉండాల్సిన పరిస్థితి. దీంతో కు టుంబాలు ఆగమయ్యేవి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందని ద్రాక్షగా ఉండేది. మరోవైపు..వైద్య విద్య భారంగా మారింది. కేవలం ఐదు కాలేజీలు ఉండటంతో 850 ఎంబిబిఎస్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. మెడిసిన్ చదువాలనుకున్న ఎంతో మంది విద్యార్థులు తమ కలలకు దూరం అయ్యేవారు. మరికొందరు మెడిసిన్ కోసం చైనా, ఉక్రెయిన్, ఫిలిప్పిన్స్ వంటి దేశాలకు వెళ్లి రూ.లక్షలు ఖర్చు పెట్టి అష్టకష్టాలు పడ్డారు. ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ కష్టాలను కళ్లారా చూశారు. స్వరాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ సేవలను పేదలకు చేరువ చేయడంతో పాటు, వైద్య విద్యను తెలంగాణ విద్యార్థులకు అందించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

వచ్చే ఏడాది మరో 9 మెడికల్ కాలేజీలు

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కాగానే.. మొదటి దశలో మహబూబ్ నగర్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. రెండో దశలో మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, సంగారెడ్డిలో కాలేజీలను ఏర్పాటు చేశారు. దీంతో కాలేజీల సంఖ్య 17కు పెరిగింది. ఎనిమిదేళ్లలోనే కాలేజీల సంఖ్య మూడున్నర రెట్లు పెరిగింది. కొత్తగా ఏర్పాటైన ఎనిమిది కాలేజీల్లో బుధవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది 9, ఆ పై ఏడాది మరో 8 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. దీంతో జిల్లాకో మెడికల్ కాలేజీ కల నెరవేరనున్నది.

కొత్తగా 1,150 ఎంబిబిఎస్ సీట్లు

రాష్ట్రంలో కొత్త కాలేజీలతో ఈ విద్యాసంవత్సరం నుంచి అదనంగా 1,150 సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి. 2014లో 850గా ఉన్న ఎంబిబిఎస్ సీట్లు ఇప్పుడు 2,790కి పెరిగాయి. అలాగే పిజి సీట్లు 531 నుండి 1,122కు, సూపర్ స్పెషాలిటీ సీట్లు 76 నుండి 152కు పెరిగాయి. కొత్త మెడికల్ కాలేజీలతో ప్రజలకు అనేక విధాలుగా లాభం కలుగనుంది.

నాణ్యమైన వైద్యం..

మెడికల్ కాలేజీల ద్వారా స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రజలకు అందుతాయి. సూపర్ స్పెషాలిటీ సేవలు కలుపుకొని, మొత్తం 35 వైద్య విభాగాలు సేవలందిస్తాయి. మెడికల్ కాలేజీల్లో అత్యాధునిక వైద్య పరికరాలు, ల్యాబ్‌లు ఉంటాయి. ఒక్కో కాలేజీలో 449 మంది డాక్టర్లు, 600పైగా పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. దీంతో ప్రజలకు మంచి వైద్యం అందుబాటులోకి వస్తుంది. పెద్ద వ్యాధి వచ్చినా హైదరాబాద్ వరకు పరిగెత్తాల్సిన అవసరం లేకుండా సమీపంలోనే మంచి నాణ్యమైన వైద్యం అందుతుంది.

డాక్టర్ కల సాకారం..

కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో రాష్ట్రంలోని ఎంబిబిఎస్ సీట్ల సంఖ్య ఎనిమిదేళ్లలో మూడు రెట్లకుపైగా పెరిగాయి. దీంతో రాష్ట్ర విద్యార్థులు స్థానికంగా చదువుకునే అవకాశాలు పెరిగాయి. డబ్బు ఖర్చు చేసుకొని విదేశాలకు వెళ్లే అవస్థ తప్పుతుంది. విదేశీ బాషల్లో ఎంబిబిఎస్ అభ్యసించే బాధలు తప్పనున్నాయి.

అభివృద్ధి విస్తరణ…

మెడికల్ కాలేజీ అంటే కేవలం ఒక విద్యా సంస్థ మాత్రమే కాదు. అనుబంధంగా అనేక వసతులు ఏర్పడుతాయి. హాస్పిటల్ అందుబాటులోకి వస్తుంది. వీటిల్లో పనిచేయడానికి భారీగా సిబ్బంది అవసరం ఉంటారు. దీంతో స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పెరుగుతుంది. విద్యార్థులు, డాక్టర్లు, సిబ్బంది, హాస్పిటళ్లకు వచ్చే రోగులు, సహాయకులు.. ఇలా ఆ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. తద్వారా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.

ఒకేసారి 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్న సిఎం కెసిఆర్

రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన 8 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో విద్యాబోధన తరగతులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్ నుంచి ఆన్‌లైన్‌లో ఒకేసారి ప్రారంభిస్తారు. తద్వారా.. సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, రామగుండం..పట్టణాల్లోని 8 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబిబిఎస్ తొలి విద్యాసంవత్సరం సిఎం కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News