మనతెలంగాణ/హైదరాబాద్ : లంచం తీసుకుంటూ మేడ్చల్ జిల్లా జీడిమెట్ల విద్యుత్ కార్యాలయ ఉద్యోగి ముంజం తుకారాం మంగళవారం నాడు ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. విద్యుత్ స్తంభాల మార్పు, కొత్త మీటర్ల ఏర్పాటుకు సంబంధించిన బిల్లుల కోసం కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని వివేకానంద నగర్ నివాసి గుడ్ల శివకుమార్ జీడిమెట్ల విద్యుత్ కార్యాలయంలో అసిస్టెంట్ గ్రేడ్ టు ఉద్యోగి ముంజం తుకారాంను సంప్రదించాడు. ఆయా బిల్లులకు అనుమతుల ఇచ్చేందుకు ఉద్యోగి తుకారాం రూ. 20వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్ శివ రూ.8,000 లంచం ఇచ్చేవిధంగా ఒప్పందం చేసుకున్న అనంతరం ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు. తొలివిడత లంచం మొత్తం రూ. 8 వేలు జీడిమెట్ల విద్యుత్ కార్యాలయంలో తుకారం తీసుకున్న వెంటనే ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. విద్యుత్ శాఖ ఉద్యోగి తుకారం టేబుల్లో ఉన్న రూ. 8వేల నగదును గుర్తించిన ఎసిబి అధికారులు ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతని చేతి వేళ్లకు కెమికర్ పరీక్షలు నిర్వహించారు. లంచం కేసులో పట్టుబడిన తుకారంను ఎసిబి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు ఎసిబి డిఎస్పి సూర్యనారాయణ తెలిపారు.