మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అప్పరెల్ ట్రైనింగ్ అండ్ డిజైన్ సెంటర్ (ఎ.టి.డి.సి) రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఓ సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది. ఎటిడిసి కేంద్ర చేనేత, జౌళి శాఖ ఆధీనంలోని ఎ.ఇ.పి.సి యొక్క శిక్షణా విభాగం. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉచిత వసతితో పాటు శిక్షణను అందించనున్నామని ఎటిడిసి ఒక ప్రకటనలో తెలిపింది. పారిశ్రామిక ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ కోర్సు 6 నెలల వ్యవధితో హైదరాబాద్ కేంద్రంలో అందించనున్నట్లు ఎటిడిసి తెలిపింది.
ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 100 మంది యువతకు శిక్షణ ఇచ్చినట్లు, రూ.15,000 నెల జీతంతో బెంగళూరులోని ప్రముఖ వస్త్ర తయారీ పరిశ్రమలో ఉద్యోగం సాధించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో మార్చిఆగస్టు 2020 కాలానికి చాలా మంది విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా జీతాలు అందుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. కొత్త బ్యాచ్కి సంబంధించిన ప్రవేశాలు డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమైనట్లు, తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన అర్హులైన విద్యార్థులు/నిరుద్యోగ యువతకు , ముఖ్యంగా గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులకు ఉచిత వసతితో పాటు శిక్షణను అందజేయనున్నట్లు, శిక్షణానంతరం విద్యార్థులకు వస్త్ర పరిశ్రమలో ఉపాధి కల్పించనున్నట్లు ఎటిడిసి తెలిపింది.
అర్హతలు ః ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. 18-25 సంవత్సరాలు వయస్సు కలిగిన వారై ఉండాలి. ఇందుకు సంబంధించిన జనన ధృవీకరణ పత్రం తప్పనిసరి. బిపిఎల్ రేషన్ కార్డ్(వైట్ రేషన్ కార్డు) కలిగి ఉండాలి. ఆధార్ కార్డ్ తెలంగాణ(గ్రామీణ ప్రాంతం మాత్రమే) ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు ఎ.టి.డి.సి, సర్వే నెం.64, నెక్ట్స్ గలేరియా మాల్, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గర, మాదాపూర్, హైటెక్ సిటీ, హైదరాబాద్81 చిరునామాలో సంప్రదించాలి. 9611238944, 990850368,9177041704 ఫోన్ నెంబర్లలోనూ సంప్రదించవచ్చు.