Tuesday, April 23, 2024

ఆస్ట్రేలియా ఆశలు గల్లంతు

- Advertisement -
- Advertisement -

England beat Sri Lanka by four wickets

సిడ్నీ: డిఫెండింగ్ ఛాంపియన్, ఆతిథ్య ఆస్ట్రేలియా టి20 ప్రపంచకప్ టైటిల్ రేసు నుంచి నిష్క్రమించింది. శనివారం శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ మెరుగైన రన్‌రేట్ ప్రాతిపాదికన సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గ్రూప్1 నుంచి ఇప్పటికే న్యూజిలాండ్ సెమీస్ బెర్త్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇంగ్లండ్ కూడా కివీస్ సరసన నిలిచింది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ శుభారంభం అందించారు. ఇద్దరు లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు.

కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన బట్లర్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 28 పరుగులు చేశాడు. మరోవైపు అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన హేల్స్ ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ వరుస క్రమంలో వికెట్లను కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. హారి బ్రూక్ )4), లివింగ్‌స్టోన్ (4) మోయిన్ అలీ (1), శామ్ కరన్ (6) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా బెన్‌స్టోక్స్ అసాధారణ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ను గెలిపించాడు. చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన స్టోక్స్ రెండు ఫోర్లతో 42 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో ఇంగ్లండ్ రెండు బంతులు మిగిలివుండగానే గెలిచి సెమీస్‌కు చేరుకుంది.

నిసాంకా దూకుడు

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు పాథుమ్ నిసాంకా అండగా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించాడు. మరో ఓపెనర్ కుశాల్ మెండిస్ ఒక ఫోర్, సిక్స్‌తో 18 పరుగులు చేశాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన నిసాంకా 2 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 67 పరుగులు సాధించాడు. అయితే ధనంజయ డిసిల్వా (9), అసలంక (8), కెప్టెన్ శనక (3), హసరంగ (9), కరుణరత్నె (0) విఫలమయ్యారు. రాజపక్స (22) పరుగులు చేశాడు. దీంతో లంక స్కోరు 141 పరుగులకు చేరింది.

కంగారూలు ఔట్

మరోవైపు ఆస్ట్రేలియా టోర్నీ నుంచి వైదొలిగింది. ఆస్ట్రేలియా కూడా ఏడు పాయింట్లు సాధించినా రన్‌రేట్ తక్కువగా ఉండడంతో సెమీస్‌కు చేరుకుండానే ఇంటిదారి పట్టింది. ఇక ఆదివారం గ్రూప్2 సెమీ ఫైనల్ బెర్త్‌లు ఖరారు కానున్నాయి. భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌లు సెమీ ఫైనల్ రేసులో ఉన్నాయి. ఈ జట్ల భవితవ్యం ఆదివారం తేలనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News