* జోరుగా సాగుతున్న ఇసుక అక్రమదందా
* అడ్డొచ్చిన విఆర్ఎను హతమార్చిన అక్రమార్కులు
మనతెలంగాణ/ పిట్లం ః ఇసుక మాఫీయా రెచ్చిపోయింది. ఇసుక తరలింపును అడ్డుకున్నందుకు వెళ్లిన విఆర్ఎను చంపేసిన ఘటన గురువారం జిల్లాలో కలకలం రేపింది. కామారెడ్డి జిల్లాలోని పిట్లం మండలంలోని కారెగాం గ్రామశివారులో బుధవారం రాత్రి కాకివాగు వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న సమాచారం అందుకున్న విఆర్ఎ సాయిలు అక్కడికి చేరుకున్నారు. ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్నాడు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య వాగ్వదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఇసుకమాఫీయా విఆర్ఎ సాయిలుపై ట్రాక్టర్ తీసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడిన సాయిలు అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పిట్లం ఎస్సై అంతిరెడ్డి హత్యకు దారి తీసిన వివరాలను తెలుసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు విచారణ చేపట్టి ట్రాక్టర్ డ్రైవర్ను, వాహనాన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య సాయవ్వ, ఇద్దరు కూతురులు, ఒక కుమారుడు ఉన్నాడని ఎస్సై తెలిపారు. మృతుడు కారెగాం గ్రామానికి చెందిన సాయిలు మార్థండ గ్రామంలో విఆర్ఎగా విధులు నిర్వహిస్తున్నాడు.