జులై 6 నుంచి
9 వరకు ఎంసెట్
1న పాలిసెట్, 4న ఇసెట్,
13న ఐసెట్, 15న ఎడ్సెట్
1 నుంచి 3 వరకు పిజిఇసెట్
10న లాసెట్, పిజిఎల్సెట్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వ్యాప్తితో లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన ఎంసెట్, ఇతర ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడులైంది. జూలై 6 నుంచి 9వ తేదీ వరకు ఎంసెట్ను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎంసెట్, ఇతర ప్రవే శ పరీక్షలకు సంబంధించిన తేదీలను విద్యాశాఖామం త్రి పి.సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పి.పాపిరెడ్డి, వైస్ ఛైర్మన్లు ఆర్. లింబాద్రి, వి.వెంకటరమణ, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తదితరులు రాష్ట్రంలోని వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి శనివారం సమీక్ష నిర్వహించారు.
అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్షించి సెట్ల రీ షెడ్యూల్ను వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి సబిత ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో జులై 6 నుంచి 9 వరకు ఎంసెట్, జులై 4న ఇసెట్, జులై 10న లాసెట్, జులై 1 నుంచి 3 వరకు పిజిఇసెట్, జులై 1న పాలిసెట్, 13న ఐసెట్, 15న ఎడ్సెట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కోవిడ్ -19 నిబంధనలకు లోబడి,యుజిసి ఇచ్చిన సలహాలకు అనుగుణంగా ఈ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించడంతో కోవిడ్-19 నేపథ్యంలో ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి షెడ్యుల్ను విడుదల చేశారు.