Friday, March 29, 2024

ఎడతెగని అంతర్రాష్ట్ర వివాదాలు

- Advertisement -
- Advertisement -

అసోం,- మిజోరామ్ సరిహద్దు వివాదంలో రెండు రాష్ట్రాల సాయుధ బలగాలు కాల్పుల వరకు వెళ్ళడం, పోలీసులు ప్రాణాలు అర్పించడం ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగిస్తున్నది. 1979 నుంచి ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు వివాదాల పోరులో 157 మంది ప్రజలు ప్రాణాలు వదలడం అత్యంత విచారకరం. వసుధైక కుటుంబ భావనలు బలపడుతున్న అమృతోత్సవ వేళ రాష్ట్రాల మధ్య వివాదాలు చెలరేగడం, రాష్ట్రాల పునర్విభజన సమయంలో స్పష్టతలు కొరవడడం, రాజకీయ పార్టీల కుర్చీలాటలో వివాదాలకు ఊతం ఇవ్వడం హాస్యాస్పదంగా తోస్తున్నది.

బ్రిటిష్ కాలం నుంచి నేటి వరకు నెలకొన్న ‘బరాక్ లోయ -లుషాయ్ హిల్స్’ ప్రాంతం అసోం, -మిజోరామ్ రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదానికి కారణం అవుతున్నది. బ్రిటిష్ కాలంలో మిజోరామ్‌ను ‘లుషాయ్ హిల్స్’గా కూడా పిలిచేవారు. 1950లో అసోం రాష్ట్రం ఏర్పడింది. 1987లో జరిగిన పునర్విభజనలో మిజోరామ్‌తో సహా ఈశాన్య రాష్ట్రాలు ఏర్పడడం, అసోంలోని కొంత భూభాగం ఇతర కొత్త రాష్ట్రాల్లోకి వెళ్ళడంతో అంతర్ రాష్ట్ర వివాదాలు ప్రారంభమైనాయి. 1875 నోటిఫికేషన్ ప్రకారం లుషాయ్ హిల్స్, చచ్చర్ ప్రాంతాలు నిర్వచించబడ్డాయి. 1933 నోటిఫికేషన్‌లో లుషాయ్ హిల్స్, మణిపూర్‌ల మధ్య సరిహద్దు ఏర్పడింది. 1875 నోటిఫికేషన్ ప్రకారం నడవాలని మిజోరామ్, 1933 నోటిఫికేషన్ ప్రకారం అంగీకరిస్తామని అసోం తమ సరిహద్దు వాదనలు వినిపిస్తున్నాయి. అసోం, -మిజోరామ్‌ల మధ్య 164.6 కిమీ సరిహద్దు ఉన్నది. గత అర్ధ శతాబ్దంగా నెలకొన్న వివాదాలు ఇటీవల బయటపడడం, వివాదాస్పద భూభాగాన్ని ‘నో మ్యాన్స్ ల్యాండ్’ గా ‘యథాతథ స్థితి’ కొనసాగించాలనే నిబంధన విధించబడింది. నేడు ఆ భూభాగం కోసమంటూ రెండు రాష్ట్రాలు అనునిత్యం గిల్లికజ్జాలు పెట్టుకుంటూ పోరాడుతూనే ఉన్నాయి.

అసోం- మేఘాలయ వివాదం
అసోం- మేఘాలయ రాష్ట్రాల మధ్య దాదాపు డజన్ ప్రాంతాల్లో (అప్పర్ తరబరీ, గజాంగ్ రిజర్వ్ ఫారెస్ట్, హహిమ్, బోక్లపర, కనపర-పిలాలగ్‌కట, రటచెర్ర, కమ్రూప్, చచ్చర్ లాంటి) సరిహద్దు వివాదాలు ఉన్నాయి. బ్రిటిష్ నిర్ణయం ప్రకారం నేడు అసోంలోని ‘కర్బి ఆన్‌గ్లాంగ్’ జిల్లాని ‘మికిర్ హిల్స్’ తమ భూభాగమని మేఘాలయ వాదిస్తున్నది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న 884.9 కిమీ సరిహద్దు వివాదాలను శాంతియుతంగా చర్చలతో పరిష్కరించుకోవాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయానికి రావడం అభినందనీయం. స్వల్ప వివాదాలు ఉన్న 6 సరిహద్దు ప్రాంతాలను వెంటనే పరిష్కరించుకుందామని ఏకాభిప్రాయానికి వచ్చారు. అధిక వివాదంలో లాంగ్‌పిహ్, బార్దుర్, నోగ్వా, మటముర్, దేశ్‌డెమెరియా, ఖాందులి ప్రాంతాలు చిక్కుకున్నట్లు తెలుస్తున్నది.

అసోం- నాగాలాండ్ వివాదం
అసోం, నాగాలాండ్ మధ్య 434 కి.మీ పొడవైన సరిహద్దు ఉంది. అసోంలోని శివసాగర్, నాగావ్, జోర్హట్, ఉరిమ్‌ఘట్, గోలఘాట్ అటవీ ప్రాంతాలు నాగా హిల్స్‌లోకి వస్తాయని నాగాలాండ్ 1963 నుంచి వాదిస్తున్నది. 1968, 1979, 1985, 2007, 2014లో జరిగిన సరిహద్దు వివాదాల్లో హింసాత్మక ఘటనలు నమోదు అయ్యాయి. ఉరిమ్ ఘట్ ప్రాంతంలోని గ్రామాల వందల ఇళ్లకు నాగాలాండ్ అల్లరి మూకలు నిప్పంటించడం గమనించాం. నేడు రెండు రాష్ట్రాలు యథాతథ స్థితిని పాటిస్తూ, సామరస్య ధోరిణితో చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని తీర్మానించడం శుభ పరిణామంగా చెప్పవచ్చు.

అసోం-అరుణాచల్ ప్రదేశ్
ఈశాన్య రాష్ట్రాల పునర్విభజన జరిగినపుడు తమకు చెందాల్సిన అధిక భూభాగాన్ని అసోంలోకి చేర్చారని అరుణాచల్ ప్రదేశ్ వాదిస్తున్నది. అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌ల మధ్య 804 కి.మీ సరిహద్దు ఉంది. 1987లో అరుణాచల్‌ప్రదేశ్ ఏర్పడిన తరువాత కమిటీ సిఫార్సు ప్రకారం కొంత అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాన్ని అసోంకు మార్చాలని సూచిస్తూ, మరో భాగాన్ని అసోం నుంచి అరుణాచల్‌ప్రదేశ్ కు మార్చాలని సిఫార్సు చేసింది. స్థానిక ప్రజలు క్షేత్రస్థాయిలో, ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో నేటికీ పోరాటం చేస్తూనే ఉన్నాయి.

లఢక్ – జమ్ముకశ్మీర్
ముస్లిం జనాభా అధికంగా ఉన్న కార్గిల్ జిల్లాను లఢల్‌లో కలపడాన్ని వ్యతిరేకిస్తూ, తమ జిల్లాను జమ్ము కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో కలపాలని పోరాటం చేయడం చూస్తున్నాం. ఈ ప్రాంతంలో చైనా సరిహద్దు వివాదాల కన్నా ఈ అంతర్గత పోరు అధికంగా బాధ పెడుతున్నది. లఢక్‌లోని లేహ్ జిల్లాలో బౌద్ధ మతస్థులు అధికంగా ఉన్నారు. లఢక్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా అంగీకరించని చైనా పలు సమస్యలను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నది. లఢక్‌లో లేహ్ ప్రాంత బౌద్ధులు, కార్గిల్ ప్రాంత ముస్లింల మధ్య శాంతి నెలకొనడం కొంత కష్టంగానే తోస్తున్నది.

లఢక్ – హిమాచల్‌ప్రదేశ్ వివాదం
హిమాచల్‌ప్రదేశ్‌లోని ‘సర్చు’ ప్రాంతానికి లఢక్ వ్యాపారవేత్తలు చొరబడడంతో వివాదం మెుదలైంది. జమ్ము కశ్మీర్ రాష్ట్రం ఉన్న సమయంలో మనాలీ -లేహ్ జాతీయ రహదారిలో లఢక్ వెళ్ళే మార్గంలో పోలీస్ అవుట్ పోస్ట్ ఉండేది. హిమాచల్‌ప్రదేశ్‌లోని లహాల్, స్పిటి జిల్లాలకు లఢక్‌లోని లేహ్ జిల్లా సరిహదులకు మధ్య కొంత కాలంగా వివాదాస్పద ఘటనలు జరుగుతున్నాయి. లేహ్, మనాలీ రహదారిలో సర్చు పట్టణం ఉంటుంది. రెండు నగరాల మధ్య ప్రయాణించే ప్రయాణికులు సర్చులో స్వల్ప విరామం కోసం ఆగుతారు. పోలీస్ అవుట్ పోస్ట్ ఉండడంతో ప్రయాణికులకు అవాంతరాలు కలుగుతున్నాయి.

హిమాచల్ ప్రదేశ్ -హర్యానా వివాదం
హిమాచల్ ప్రదేశ్‌లోని పారిశ్రామిక ‘పర్వానూ’ ప్రాంతం హర్యానాలోని ‘పంచ్ కుల’ జిల్లాకు మార్చాలని హర్యానా ప్రభుత్వం ఎప్పటినుంచో కోరుతున్నది. రెండు రాష్ట్రాల మధ్య అటవీ భూభాగ సరిహద్దు వివాదం కూడా కొనసాగుతున్నది. ఈ అటవీ ప్రాంతంలో ‘ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన’, పియంజియస్‌వై కింద రోడ్డు నిర్మాణానికి కూడా అంగీకారం రావలసి ఉంది.

ఒడిశా జార్ఖండ్ వివాదం
ఒడిశాలోని ‘కియోంఝర్’ జిల్లాకు చెందిన ‘జగన్నాథపూర్’ గ్రామం పట్ల ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలు పోరాడుతున్నాయి. కియోంఝర్ జిల్లా పర్వతాల్లో జనించిన ‘బైతరణి’ నదీ జలాల వినియోగంలో కూడా రెండు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తున్నది. ఈ నదీ జలాలు అధికంగా ఒడిశా ప్రాంతాలకు, కొద్ది మెుత్తంలో జార్ఖండ్‌కు ఉపయోగపడుతున్నాయి.

ఒడిశా -పశ్చిమ బెంగాల్ వివాదం
‘బాలసూర్’ జిల్లాలోని 82 గ్రామాల పట్ల రెండు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తున్నది. ఒడిశా రాష్ట్రంలోని 30 జిల్లాల్లో 08 జిల్లాలు సరిహద్దు వివాదంలో నలుగుతున్నాయి. ఒడిశాలోని ఇనుప ఖనిజ వనరులున్న ‘మయూర్‌భంజ్’ జిల్లా సరిహద్దుల్లో కూడా వివాదం నలుగుతోంది.

ఒడిశా చత్తీస్‌గఢ్ వివాదం
ఒడిశాలోని నాబరంగ్‌పూర్, జర్సుగూడ జిల్లాల్లోని కొన్ని గ్రామాల పట్ల రెండు రాష్ట్రాలు వివాదంతో ఊగుతున్నాయి. రెండు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారానికి 2018లో కేంద్ర ప్రభుత్వం ‘మహానది జల వివాదాల ట్రిబ్యునల్’ను ఏర్పాటు చేసింది.

ఒడిశా- ఆంధ్రప్రదేశ్ వివాదం
ఒడిశాలోని ‘కోరపుట్’ జిల్లాకు చెందిన మూడు గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే ఎన్నికలు కూడా నిర్వహించింది. దీనికి తోడుగా ఒడిశాలోని గంజమ్, గజపతి, రాయగడ జిల్లాల్లోని పలు గ్రామాలు తమవే అంటూ ఆంధ్ర వాదిస్తున్నది. 1960 నుంచి రెండు రాష్ట్రాల మధ్య ‘కోటిలా గ్రామ పంచాయత్’్క చెందిన 21 గ్రామాలు వివాదంలో ఉన్నాయి. ఒడిశాలోని కోరపూట్, ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లాలోని సాలూరు ప్రాంతా ప్రజలు రెండు రాష్ట్రాల పథకాలను అనుభవిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం కూడా ఉన్నదని, 2006లో ఒడిశా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేసింది.

మహారాష్ట్ర – కర్నాటక వివాదం
1956 నుంచి కర్నాటకలోని మరాఠా అధికంగా మాట్లాడే ప్రజలున్న ‘బెల్గామ్’ జిల్లా ప్రాంతమంతా తమదే అంటూ మహారాష్ట్ర వాదనకు దిగుతోంది. బ్రిటిష్ పాలనలో బాంబే ప్రెసిడెన్సీలో ఉన్న బెల్గామ్ ప్రాంతం 1956 రాష్ట్రాల పునర్విభజనలో కర్నాటకకు కేటాయించబడిన విషయం తెలిసిందే.

తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ వివాదం
కృష్ణ, గోదావరి నదులపై గల, నిర్మిస్తున్న ప్రాజెక్టులు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలకు కారణం అవుతున్నాయి. కేంద్ర జల శక్తి మంత్రిత్వశాఖ, కృష్ణ, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డులను (కెఆర్‌యంబి, జిఆర్‌యంబి) వేరువేరుగా ఏర్పాటు చేసింది. నదీ జలాల వివాదాలను 14 అక్టోబర్ -2021 నుంచి ఈ బోర్డుల పరిధిలోకి తెచ్చింది. 36 కృష్ణా నదిపై ప్రాజెక్టులను, 71 గోదావరి నదుల ప్రాజెక్టులను తెస్తున్నామని, ఈ బోర్డులే ప్రాజెక్టుల నిర్వహణ, ఆపరేషన్, పాలన, రెగ్యులేషన్ పనులను చూసుకుంటాయని, దీని కోసం ఒక్కో రాష్ట్రం 200 కోట్లును బోర్డుల పేరున జమ చేయాలని సూచించింది. ఈ బోర్డుల ఏర్పాటు కూడా వివాదాస్పదమైంది.

భారత దేశంతో ఇరుగు పొరుగు దేశాలు 15,107 కి.మీ పొడవు సరిహద్దులను, 7,517 కి.మీ తీర ప్రాంతాలను కలిగి ఉంది. ఇండియాకు బాహ్య ముఖ్య శత్రు దేశాలుగా చైనా, పాకిస్థాన్ నిత్యం కాలు దువ్వుతున్నారు. ఈ దేశాలతో పాటుగా మయన్మార్, నేపాల్, భూటాన్‌లు కూడా సరిహద్దు వివాదాలను అనునిత్యం రేపుతున్నా యి. సరిహద్దు దేశాలతో అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, వారి కదలికలను గమనిస్తూ, అవసరమైనపుడు వారికి సరైన బుద్ధి చెప్పడానికి భారత్ ఎన్నడూ వెనకడుగు వేయలేదు. బాహ్య శత్రువులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న భారతంలో అంతర్ రాష్ట్ర వివాదాలు అంతర్గత అశాంతికి కారణం కావడం సోచనీయం. వివిధ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను కేంద్రప్రభుత్వ మధ్యవర్తిత్వం తో శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ప్రతినబూనుదాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News