Friday, April 26, 2024

మరో ఎనిమిది మెడికల్ కాలేజీలు

- Advertisement -
- Advertisement -

పరిపాలన అనుమతులు జారీ

మన : రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆశయ సాధన దిశగా వైద్యారోగ్య శాఖ మరో అడుగు వేసింది. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు మరో 8 జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటు, అనుబంధ దవాఖానల అప్‌గ్రేడేషన్‌కు పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, జనగాం జిల్లా ల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రం ఏర్పడగానే మొదటి విడతగా ప్రభుత్వం మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేటలో 4 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించింది. దీంతో ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రావడంతో పాటు, ఈ కళాశాలల్లో వైద్య విద్యా బోధన విజయవంతంగా జరుగుతున్నది. రెండో విడుతగా మరో 8 వైద్య కళాశాలలను మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డిలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిల్లో ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి.

తాజాగా మూడో విడుతగా రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, జనగాం జిల్లాల్లో నూతనంగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి కాలేజీలో 100 ఎంబిబిఎస్ సీట్లకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. కాలేజీ భవనాల నిర్మాణాలను ఆర్ అండ్ బీ శాఖకు అప్పగించింది. హాస్పిటల్ భవనాల అప్‌గ్రేడింగ్, పరికరాలు, ఫర్నిచర్ కొనుగోలు బాధ్యతలను టిఎస్‌ఎంఎస్‌ఐడిసికి అప్పగించారు. ఆయా మెడికల్ కాలేజీలకు అటాచ్ చేస్తున్న హాస్పిటల్‌ను వైద్యవిధాన పరిషత్తు పరిధి నుంచి డిఎంఇ పరిధికి బదిలీ చేశారు. ఈ 8 మెడికల్ కాలేజీలను మొత్తం రూ. 1,479 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు.

జిల్లా                               మెడికల్ సీట్ల సంఖ్య                             కేటాయింపులు

రాజన్న సిరిసిల్ల                              100                                  రూ.166 కోట్లు

వికారాబాద్                                   100                                  రూ.235 కోట్లు

ఖమ్మం                                       100                                 రూ.166 కోట్లు

కామారెడ్డి                                     100                                 రూ.235 కోట్లు

కరీంనగర్                                     100                                  రూ.150 కోట్లు

జయశంకర్ భూపాలపల్లి                      100                                 రూ.168 కోట్లు

కుమ్రంభీం ఆసిఫాబాద్                        100                                 రూ.169 కోట్లు

జనగాం                                       100                                  రూ.190 కోట్లు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News