Saturday, April 20, 2024

బిజెపిలోకి మాజీ సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి..?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కిరణ్ కుమార్ రెడ్డి ఆ పార్టీని వీడనున్నారనే ప్రచారం జోరందుకుంది. కొంత కాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తిరిగి ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బిజెపిలోకి చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం సోషల్ మీడియాలో ప్రముఖంగా మారింది. ఆదివారం హైదారాబాద్‌కు బిజెపి అగ్రనేత అమిత్ షా రానున్నారు. ఇప్పటికే బిజెపి అగ్రనేతలు కిరణ్ కుమార్ రెడ్డితో చర్చలు జరిపినట్టుగా సమాచారం. అమిత్ షాతో మాజీ సిఎం కిరణ్ కుమార్‌రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆయన సమక్షంలోనే కిరణ్‌కుమార్ రెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నారు.

కిరణ్‌కుమార్ రెడ్డికి పార్టీలో ఏ పదవి ఇస్తారనేది సైతం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఎపి బిజెపి వ్యవహారాలు అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత సమైక్య ఆంధ్ర పార్టీ పెట్టారు. ఆ పార్టీ అంతగా ఆదరణకు నోచుకోలేదు. దీంతో ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరినా ఎప్పుడూ క్రియాశీలకగా ఆయన కొనసాగలేదు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన బిజెపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాయలసీమలో తమ పార్టీని బలోపేతం చేసుకునేందుకు బిజెపి సైతం ఆయనను ఆహ్వానిస్తున్నట్టు సమాచారం.

కాంగ్రెస్‌లో కీలక పదవులు..
కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించిన కిరణ్ కుమార్ రెడ్డి.. పార్టీలో పలు పదవులు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభపతిగా పనిచేశారు. 2010 నవంబర్‌లో ఉమ్మడి ఎపి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదిలా ఉంటే తెలంగాణ ఉద్యమ సమయంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన మాజీ సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి .. బిజెపిలో చేరడం ఖాయం కావడంతో.. ఆయన లక్షంగా రానున్న రోజల్లో బిఆర్‌ఎస్ నేతలు విమర్శలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News