Friday, March 29, 2024

విద్యార్థులకు పరీక్షా కాలం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : పరీక్షల కాలం మొదలైంది. విద్యార్థులు తమలోని సత్తా చాటేలా సర్వసన్నద్దమయ్యేందుకు ఇది అత్యంత కీలక సమయం. ఓ వైపు వార్షిక పరీక్షలు సమీపిస్తుండగా, మరోవైపు ప్రవేశ పరీక్షల తేదీలూ దగ్గరపడుండటం విద్యార్థులకు సవాల్‌గా మారుతుంది. ఈ రెండింటినీ సమతుల్యం చేసుకునేలా విద్యార్థులు తమను తాము సమాయత్తం చేసుకోవడంతో పాటు పక్కా ప్రణాళికలతో సన్నద్ధం కావడం అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మార్కులే ప్రామాణికంగా ఇప్పటికే విద్యార్థులపై ఒత్తిడి మొదలైంది.

15 నుంచి ఇంటర్, ఏప్రిల్ 3 నుంచి టెన్త్ పరీక్షలు

పది, ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అధికారులు, పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసే దిశగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతుండగా, మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై ఇప్పటికే రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 9,51,022 మంది విద్యార్థులు హాజరయ్యే ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పకడ్బంధీగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల కోసం 1,473 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

ఓ వైపు అకడమిక్.. మరో వైపు కాంపిటేటివ్

ఇంటర్మీడియేట్ ద్వితీయ సంవత్సరం చదివే సైన్స్ గ్రూప్‌లకు చెందిన విద్యార్థులు వార్షిక పరీక్షలతో పాటు జెఇఇ మెయిన్, అడ్వాన్స్‌డ్, నీట్‌తో పాటు ఎంసెట్, ప్రైవేట్ ఇంజనీరింగ్ పోటీ పరీక్షలకు హాజరవుతుంటారు. ఈ విద్యార్థులు ఒక వైపు అకడమిక్ చదువులు కొనసాగిస్తూనే మరో వైపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇప్పటికే మొదటి జెఇఇ మెయిన్ పూర్తి కాగా, ఏప్రిల్‌లో 6 నుంచి 12 వరకు రెండో విడత జెఇఇ మెయిన్ జరగనుంది. బైపిసి విద్యార్థులు నీట్‌తో పాటు ఎంసెట్‌కు సన్నద్ధమవుతుంటారు. మే 7వ తేదీన నీట్ పరీక్ష జరగనుంది. అయితే వార్షిక పరీక్షలకు సన్నద్దమవుతునే పోటీ పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇందుకోసం పక్కా ప్రణాళికతో రెండింటీని సమతుల్యం చేసుకుంటూ సిద్ధం కావాలని నిపుణులు చెబుతున్నారు.

మే నెలంతా ప్రవేశ పరీక్షలే
ఉన్నత విద్యకు సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే నెలంతా పలు పరీక్షలు జరగనున్నాయు. మే 7వ తేదీ నుంచి 14 వరకు ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజనీరింగ్, మే 12 నుంచి 14 వరకు ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు జరగనున్నాయి. అదే విధంగా మే 18న ఎడ్‌సెట్, మే 20న ఇసెట్ పరీక్ష, మే 25న లాసెట్, పిజిఎల్‌సెట్ ప్రవేశ పరీక్ష ఉంటుంది. మే 26,27 తేదీల్లో టిఎస్ ఐసెట్ పరీక్ష, మే 29 నుంఇ పిజిఇసెట్ పరీక్షలు జరుగనున్నాయి.

ఒత్తిడిని అధిగమించాలి..
పరీక్షలంటే విద్యార్థుల్లో కొంత టెన్షన్, బెరుకు ఉండటం సహజం. వాటిని ఎదుర్కొని ప్రశాంతంగా పరీక్షలు రాస్తే అనుకున్న లక్ష్యం నెరవేరినట్టే. జ్ఞాపక శక్తి తగ్గడానికి ప్రధాన కారణం ఒత్తిడి. ఏ పని చేసినా ఆందోళనతో చేయడం.. హడావుడిగా మాట్లాడటంతో డిప్రెషన్ అధికమవుతుంది. అది మనసుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. హోంవర్క్, పరీక్షల మార్కులపై ఒత్తిడి తెస్తే చాలా ప్రమాదం. ఒత్తిడితో బాధ పడే వారు మతిమరుపునకు గురయ్యే అవకాశం ఉంది. సరిపడా నిద్ర, మంచి ఆహారం, ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. అనవసర విషయాలు పట్టించుకోకుండా లక్ష్యం వైపు అడుగులు వేయాలి.

నిద్ర ఎంతో ఉపశమనం
పరీక్షలు దగ్గరపడుతున్న కొద్దీ విద్యార్థులు కేవలం చదువుపైనే దృష్టి పెట్టి మంచి ఉత్తీర్ణత సాధించాలని అహర్నిశలు కృషి చేస్తుంటారు. చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోరు. దీంతో పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.అలసిన శరీరానానికి నిద్ర ఎంతో ఉపశమనం ఇస్తుందని, ప్రతి రోజూ ఎనిమిది గంటల పాటు నిద్ర ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

పోషకాహారం కీలకం..
పోషకాహారం తీసుకోవడం అత్యవసరం. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం సూక్ష్మ పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. పరీక్షల సమయంలో సరైన ఆహారం తీసుకోక పోతే అనేక అనర్థాలు కలుగుతాయి. చదివింది గుర్తుండాలన్నా ఆరోగ్యంగా ఉండాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News