మనతెలంగాణ/హైదరాబాద్ : డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ(దోస్త్) ప్రత్యేక విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల నమోదు గడువును ఈ నెల 28వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే మూడవ విడత కౌన్సెలింగ్లో సీట్లు పొందిన విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ గడువును ఈ నెల 28 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీన దోస్త్ ప్రత్యేక విడత సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక విడతలో సీట్లు పొందిన విద్యార్థులు నవంబర్ 5వ తేదీ వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని తెలిపారు.అలాగే ఇప్పటివరకు వివిధ విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 31 నుంచి వచ్చే నెల 5 వరకు ఆయా కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాలని అన్నారు. డిగ్రీ సీట్ల కోసం ఇప్పటివరకు దోస్త్లో రిజిస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులు మరో మంగళ, బుధవారాలలో రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోని అభ్యర్థులు ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.