ఇ-కామర్స్ పోర్టల్స్కు కెవిఐసి ఆదేశం
న్యూఢిల్లీ: నకిలీ ఖాదీ వస్త్రాల అమ్మకాలను నిలిపివేయవలసిందిగా అమేజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ తదితర ఇ-కామర్స్ పోర్టల్స్ను ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్(కెవిఐసి) శనివారం ఆదేశించింది. తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఖాదీ ఇండియా బ్రాండ్ నేమ్ను వాడుకుంటున్న దాదాపు 1,000 సంస్థలకు లీగల్ నోటీసులు పంపినట్లు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఖాదీ ఇండియా బ్రాండ్ నేమ్తో వివిధ అమ్మకందారులు ఖాదీ మాస్కులు, హెర్బల్ సోపులు, షాంపూలు, కాస్మటిక్స్, హెర్బల్ మెహందీ, జాకెట్లు, కుర్తాలు తదితర అనేక వస్తువులను ఇ-కామర్స్ పోర్టల్స్ ద్వారా విక్రయిస్తున్నారు. ఈ వస్తువులన్నీ స్వచ్ఛమైన ఖాదీ ఉత్పత్తులన్న తప్పుడు అభిప్రాయం ఆన్లైన్ కొనుగోలుదారులలో ఏర్పడింది. ఆయుష్ ఇ-ట్రేడర్స్ అనే సంస్థ అమ్ముతున్న వస్తువులలో అత్యధికం ఇ-కామర్స్ పోర్టల్స్ను తొలగించడం జరిగింది.
వగద్ ఖాదీ ప్రాడక్ట్ పేరుతో అమ్ముతున్న వివిధ ఉత్పత్తులకు సంబంధించిన 140 లింకులను తొలగించినట్లు ఈ సంస్థ కెవిఐసికి తెలిపింది. లాక్డౌన్ అమలులో ఉన్న కాలంలో నకిలీ ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలు విస్తృతంగా జరిగాయని మంత్రిత్వశాఖ తెలిపింది. ఖాదీ పేరిట కాస్మెటిక్స్, ఇతర వస్తువులను అనధికారికంగా విక్రమిస్తున్న ఖాదీ ఎసెన్షియల్స్, ఖాదీ గ్లోబల్ అనే రెండు సంస్థలకు గత నెలలో కెవిఐసి లీగల్ నోటీసులు ఇచ్చిందని మంత్రిత్వశాఖ తెలిపింది. ఫాబ్ ఇండియా నుంచి రూ. 500 కోట్ల నష్ట పరిహారం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం ముంబై హైకోర్టులో పెండింగ్లో ఉందని మంత్రిత్వశాఖ వివరించింది.