Thursday, April 25, 2024

పులిదాడిలో రైతు మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/వాంకిడి: కుమ్రంభీం ఆసిఫాబాద్ జి ల్లా వాంకిడిలో విషాదం చోటు చేసుకుంది. పత్తి పంట వద్దకు వెళ్లిన రైతుపై పులి దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోడు భూముల సర్వే కోసం అధికారులు తన చేనుకు వస్తున్నారని భావించిన చౌపాన్ గూడ గ్రామ పరిధిలోని ఖానాపూర్ గ్రా మానికి చెందిన సిడాం భీం (69) అనే రైతు కూడా వారి వెంట వెళ్లాడు. పక్కనే తన పొలంలో వేసిన పత్తి పంటను చూసేందుకు పొలంలోకి వెళ్లగా అక్కడే మాటువేసిన పులి ఒక్కసారిగా అతడిపై వెనుక నుంచి దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్ గ్రామ శివారులోని పంట పొలాలలో కొట్టాల్లో ఉన్న పశువులపై ఉదయం సమయంలో పులి దాడి చేయడంతో అక్కడే ఉన్న రైతులు పులిపై కర్రలతో దాడి చేసి తరిమికొట్టారు. కాగా, ఆ పులి గ్రామంలోని పొలాల్లోకి పోయింది. కాగా, గోందాపూర్ గ్రామంలో ఫారెస్టు, పంచాయతీ అధికారులు, గ్రామానికి చెందిన కమిటీ సభ్యులు, పలువురు రైతులు పోడు భూముల సర్వే కోసం వెళ్లారు.

ఇదే సందర్భంలో వారితో కలిసి అక్కడికి వెళ్లిన భీం పనిలోపనిగా తన పత్తి పంట వద్దకు వెళ్లేసరికి పులి అతనిపై దాడిచేసి కొంత దూరం లాక్కెలి చంపేసింది. ఇది గమనించిన రైతులు అక్కడికి వెళ్లేసరికి అక్కడ నుంచి పులి అడవిలోకి పారిపోయిందని రైతులు తెలిపారు. ఈ మధ్యకాలంలో పులులు అటవీ ప్రాంతం నుంచి పంట పొలాల్లోకి వస్తుండడంతో రైతులు భయందోళనకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైన ఆటవీ ఆధికారులు స్పందించి పులులను ఆటవీ ప్రాంతంలోకి పంపించాలని వేడుకుంటున్నారు. విషయం తెలుసుకున్న అటవీ, పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News