మన తెలంగాణ/జోగులాంబ గద్వాల్: ఓ రైతు తన వ్యవసాయ భూమి తనకు దక్కదేమోనని ఆందోళన చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లాలోని మల్దకల్ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మల్దకల్ మండలంలోని మద్దెలబండ గ్రామానికి చెందిన రైతు ఈరన్నకు సర్వేనెంబర్ 63, 64లో మూడు ఎకరాల పదహారు గుంటల పొలం ఉంది. దీనిని మద్దెలబండ తండకు చెందిన రాములు నాయక్ అక్రమంగా ఆక్రమించుకొని పొలాన్ని దున్నుకోవడం జరిగింది. ఈ పొలం నాదని ఈరన్న అడిగితే ఈరన్న పై రాములు నాయక్ కేసు నమోదు చేయించడం జరిగింది. ఇక న్యాయం జరగదని భావించిన ఈరన్న ముఖ్యమంత్రి కార్యాలయానికి ధరఖాస్తూ పెట్టుకోవడం జరిగింది. దరఖాస్తును పరిశీలించిన సిఎం కార్యాలయం ఈరన్నకు సర్వే చేయించి న్యాయం చేయాలని కలెక్టర్ కార్యాలయం ద్వారా తహసీల్దార్ కార్యాలయంకు లేఖ పంపించడం జరిగింది. ప్రభుత్వ సర్వేయర్ బ్రహ్మయ్య పొలాన్ని సర్వే చేసి రిపోర్ట్ ఇస్తున్న సమయంలో అరవై వేల రూపాయలు లంచం అడిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన పై తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిని వివరణ కోరగా కార్యాలయ సిబ్బంది సమాధానం దాటవేయడం జరిగింది. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని ఈరన్న కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.