Wednesday, April 24, 2024

బీహార్‌లో హింసాత్మకంగా రైతుల నిరసన..

- Advertisement -
- Advertisement -

పాట్నా: బీహార్‌లో రైతుల నిరసన హింసాత్మకంగా మారింది. రైతుల రాళ్ల దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. అనేక పోలీస్ వాహనాలు ధ్వంసమయ్యాయి. బక్సర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చౌసా ప్రాంతంలో సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్ (ఎస్‌జేవీఎస్) పవర్ ప్లాంట్ నిర్మిస్తున్నారు. ఈ ప్లాంట్ కోసం 12 ఏళ్ల కిందట ప్రభుత్వం సేకరించిన వ్యవసాయ భూములకు పెరిగిన విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు.

గత 85 రోజులుగా నిర్మాణంలో ఉన్న ఈ ప్లాంట్ గేటు బయట రైతులు శాంతియుతంగా నిరసనలు చేస్తున్నారు.మంగళవారం రాత్రి 11.45 గంటలకు బనార్‌పూర్ గ్రామానికి పోలీసులు పెద్దసంఖ్యలో చేరుకుని ఇళ్లల్లోకి చొరబడి నిద్రిస్తున్న కొందరు రైతులను లాఠీలతో కొట్టారు. నిరసనలకు నేతృత్వం వహిస్తున్న నరేంద్ర తివారీతోపాటు నలుగురిని అదుపు లోకి తీసుకున్నారు. అడ్డుకోబోయిన మహిళలను కూడా కొట్టారు.

మరోవైపు ఈ విషయం తెలిసిన రైతులు ఆగ్రహంతో రగిలిపోయారు. బుధవారం ఉదయం పవర్ ప్లాంట్‌తోపాటు అక్కడ ఉన్న పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. కర్రలు, రాడ్లు చేతపట్టి పోలీస్ వాహనాలను ధ్వంసం చేశారు. పలు వాహనాలను తగుల బెట్టారు. ప్లాంట్ గేట్ ముందు టైర్లు కాల్చి రోడ్డును బ్లాక్ చేశారు. రైతులను నియంత్రించేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. అయితే రైతుల దాడిలో నలుగురు పోలీసులు గాయపడ్డారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులను పెద్ద సంఖ్యంలో అక్కడ మోహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News