22న చలో లక్నో, 29న ట్రాక్టర్ ర్యాలీ
కిసాన్ నేత దర్శన్పాల్
న్యూఢిల్లీ : తమ నిర్ణీత నిరసన కార్యక్రమాలను ఆపేది లేదని, ఇవి కొనసాగుతాయని రైతు నేతలు శనివారం స్పష్టం చేశారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు మోడీ దిగివచ్చారు. రద్దుతో నిమిత్తంలేకుండా తమ కార్యక్రమాలు ఇక ముందు కూడా జరుగుతాయని క్రాంతికార్ కిసాన్ యూనియన్ నేత అయిన దర్శన్పాల్ సింగ్ విలేకరులకు తెలిపారు. ఇంతకు ముందు అనుకున్న విధంగానే ఈ నెల 22న లక్నోకు ర్యాలీ ఉంటుంది. ఈ నెల 26న తమ ఉద్యమానికి ఏడాది నేపథ్యంలో సభ, ఈ నెల 29వ తేదీన పార్లమెంట్కు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహణ కొనసాగుతుందని, వీటిలో మార్పేమీ లేదని వివరించారు. తమ ఉద్యమంలోని డిమాండ్లలో మరికొన్ని అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి. కనీస మద్దతుధరకు భరోసా, నిరసనల దశలోని కేసుల ఎత్తివేత, 2020 పవర్ బిల్లు వాపసు , వాయు ప్రమాణాల ఆర్డినెన్స్ ఉపసంహరణ వంటివి పెండింగ్లో ఉన్నాయని ఇవి పరిష్కారం అయితేనే తమ ఉద్యమ లక్షం పూర్తిగా సిద్ధించినట్లు అవుతుందన్నారు.