Thursday, March 28, 2024

ఎంపి అర్వింద్‌పై ఆగ్రహజ్వాల

- Advertisement -
- Advertisement -

పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి, గిట్టుబాటు ధర కల్పించాలి
పసుపు బోర్డు తేలేని ఎంపి అరవింద్ వెంటనే రాజీనామా చేయాలి
పసుపు రైతుల మహాధర్నా

Farmers strike for turmeric board in Nizambad

మన తెలంగాణ/ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణం మామిడిపల్లి నేషనల్ హైవే రోడ్డు నెం. 44 వద్ద పసుపు రైతులు మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మద్దతుగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ఈ చట్టం వల్ల రైతులకు మేలు జరిగేది లేదని, ఆ చట్టం కేవలం కార్పొరేట్ వ్యాపార లాభం చేకూరుతుందని అన్నారు. ప్రపంచ దేశాల్లో పసుపు పండించే రైతులు తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోనే అత్యధికంగా ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, క్వింటాలు పసుపు 15 వేల రూపాయల చొప్పున కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్రం నిత్యావసర సరుకుల చట్టం తీసుకొస్తే అది చిన్న, సన్నకారు రైతులకు లాభమా? నష్టమా? రైతులు పండించిన పంటను తమ ఇంటి వద్ద నిల్వ ఉంచుకోవాలని ఆ చట్టంలో ఉందని, రాష్ట్రంలో ఉన్న రైతులు తాము పండించిన పంటను నిల్వ ఉంచుకొనే స్తోమత లేనివారని, కేవలం వ్యాపారులకు లబ్ధ్దిపొందేలా ఈ చట్టం ఉందని అన్నారు. రైతుల వద్ద తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్ముకోవడం ఈ చట్టం వర్తిస్తుందని అన్నారు. ఇది కేవలం అంబానీ, ఐటిసి వారికి, కార్పొరేట్ వ్యాపారస్తులకు ఈ చట్టం వర్తిస్తుందన్నారు. పసుపు బోర్డు తెస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన బిజెపి ఎంపి అర్వింద్ నేటి వరకు పసుపు బోర్డు లేకుండా స్పైస్ బోర్డు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారని అన్నారు.

ఈ బోర్డు వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని, తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీలో గత 45 రోజులుగా రైతులు పోరాటం చేస్తున్నారని, మనమందరం పసుపు మద్దతు ధర తెలిపే వరకు ఈ పోరాటాన్ని ఆగకుండా ఉద్యమిస్తామని ఆయన అన్నారు. ఏసిపి వి.రఘు ఆధ్వర్యంలో పోలీసులు పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్వేష్ రెడ్డి, ప్రభాకర్, వెంకటేష్, ఆర్మూర్ డివిజన్‌లో ఉన్న అన్ని మండలాల్లో రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News