మన తెలంగాణ/సూర్యాపేట: తండ్రి చేతిలో కొడుకు దారుణ హత్యకు గురైన సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని శ్రీరామనగర్కు చెందిన రామస్వామి, గౌరమ్మ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. రామస్వామి వృత్తి రీత్యా క్షౌరం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమారుడు తంగెళ్ల నరేష్(28) వివాహమైన కొద్ది రోజులకే విడాకులు తీసుకున్నాడు. కొద్ది కాలంగా మద్యం సేవించి తల్లిదండ్రులను వేధింపులకు గురి చేయడమే గాకుండా దాడికి దిగుతున్నట్లు స్థానికులు తెలిపారు. శనివారం రాత్రి పూర్తిగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన నరేష్ తండ్రిపై దాడికి దిగాడు. విసిగివేసారిన తండ్రి రామస్వామి రోకలిబండతో నరేష్ తలపై మోదడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రామస్వామిని అదుపులోకి తీసుకున్నారు.
Father killed son in Suryapet