Saturday, April 20, 2024

ముగ్గురు కూతుళ్లను ముంచేశాడు

- Advertisement -
- Advertisement -

Daughters

 

భార్యతో గొడవపడి కుమార్తెలను చెరువులో ముంచి చంపేసిన తండ్రి

మనతెలంగాణ/బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామ శివారులోని ఎర్రమన్ను కుచ్చలో శుక్రవారం జరిగిన సంఘటన దిగ్బ్రాంతికి గురి చేసింది. చెడు వ్యసనాలకు బానిసైన ఓ తండ్రి రూ. 600ల కోసం భార్యతో గొడవ పడ్డాడు. భార్య రూ. 600 ఇవ్వకపోవడంతో కోపోద్రిక్తుడైన భర్త తన ముగ్గురు కుమార్తెలను గ్రామ సమీపంలోని చెరువు లో ముంచి దారుణంగా హత్య చేశాడు. కుమారుడు తన తండ్రి చెయ్యి కొరికి తప్పించుకుని ఇంటికి చేరుకున్నాడు. ఈ ఘటన బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రమన్ను కుచ్చలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రమన్ను కుచ్చలో ఫయాజ్ తన భార్య, నలుగురు పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే, ఫయాజ్ తాగుడు, పేకాట, బెట్టింగ్ తదితర వ్యసనాలకు బానిసయ్యాడు. తరుచూ డబ్బుల కోసం భార్యను హింసించే వాడని గ్రామస్తులు తెలిపారు. ఇదిలా ఉండగా, గురువారం రాత్రి ఫయాజ్ తన భార్య నిలోఫర్ బేగంను ఆరు వందలు రూపాయలు ఇవ్వాలని అడిగాడు.

ఆమె తన వద్ద లేవని చెప్పడంతో ఫయాజ్ భార్యతో గొడవ పడ్డాడు. తన దగ్గర డబ్బులు లేవని, కరాఖండిగా చెప్పడంతో ఆమెపై చెయ్యి కూడా చేసుకున్నాడు. రాత్రి గొడవ జరిగిన అనంతరం ఫయాజ్ మద్యం తాగి మళ్లీ గొడవ పడ్డాడు. తెల్లవారు జామున ఫయాజ్ నిద్ర లేచాడు. గ్రామంలోని ఒక వ్యక్తి కందురుకు పిలిచాడని, పిల్లలను రెడీ చేయాలని భార్యతో చెప్పాడు. ఈ మేరకు నిలోఫర్ బేగం నలుగురు పిల్లలకు స్నానం చేయించి రెడి చేసింది. ఫయాజ్ కూడా స్నానం చేసిన అనంతరం తన నలుగురు పిల్లలను బయటకు తీసుకెళ్లాడు. వారికి బిస్కెట్లు, చాక్లెట్లు ఇప్పించాడు. అనంతరం పిల్లలను తీసుకుని గ్రామ సమీపంలోని చెరువు వద్దకు చేరుకున్నాడు. తండ్రి వాలకాన్ని చూసి కొడుకు భయభ్రాంతులకు గురయ్యాడు. తండ్రి చేతిని కొరికి ఇంటికి పారిపోయాడు. అనంతరం ఫయాజ్ తన ముగ్గురు కూతుళ్లు ఆఫియా (10), మాహి (9) జోయ (7) లను చెరువు నీటిలో ముంచి కాళ్లతో తొక్కి వారిని దారుణంగా హత్య చేశాడు.

హత్య చేసిన అనంతరం ఫయాజ్ గ్రామంలోకి తిరిగి వచ్చాడు. భార్య ఎదురు వచ్చి పిల్లలు ఎక్కడున్నారని ప్రశ్నించింది. పిల్లలు కందురులో భోజనం చేస్తున్నారని భార్యతో ఫయాజ్ చెప్పాడు. అయినప్పటికి నిలోఫర్ బేగంకు అనుమానం వచ్చి పిల్లల కోసం చెరువు వైపు వెళ్లింది. ఓ రైతు చెరువుపై నుంచి గ్రామంలోకి వస్తుండగా, నిలోఫర్ బేగం తన పిల్లల గురించి వాకబు చేసింది. తనకు చెరువు కట్టపై పిల్లల చెప్పులు కనబడ్డాయని రైతు నిలోఫర్ బేగంతో చెప్పాడు. దీంతో నీలోఫర్ బేగం రైతు ఇద్దరు కలిసి చెప్పులు విడిచిన చోటకు వెళ్లి చెరువు చుట్టు పక్కల వెతికారు. తన భర్త పిల్లలను చెరువులో తోసి వేసి, హత్య చేశాడని ఆమె కన్నీరు మున్నీరైంది. వెంటనే రైతు పోలీసులకు, గ్రామస్తులకు సమాచారం అందించాడు. వెంటనే బాన్సువాడ డీఎస్పీ దామోదర్ రెడ్డి, సిఐ మహేష్ గౌడ్‌లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. చెరువు నీటిలో పిల్లల కోసం ఈతగాళ్లు గాలించి ముగ్గురు చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. చిన్నారుల మృతదేహాలను చూసి తల్లి గుండెలవిసేలా రోదించింది.

గ్రామస్తులు కూడా చిన్నారుల మృతదేహాలను చూసి కంట తడి పెట్టారు. ఇదిలా ఉండగా, సిఐ ఫయాజ్ కోసం గ్రామంలో గాలించారు. కల్లు దుకాణంలో ఫయాజ్ కల్లు సేవిస్తుండగా, పోలీసులు పట్టుకుని ఫయాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు చిన్నారుల మృతదేహాలకు పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియాస్పత్రికి తరలించారు. భార్య నిలోఫర్ బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తాడ్కోల్ గ్రామంలో విషాద ఛాయలు..
బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామ శివారులోని ఎర్రమన్ను కుచ్చలో శుక్రవారం జరిగిన ముగ్గురు చిన్నారుల దారుణ హత్యతో తాడ్కోల్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లి నిలోఫర్ బేగం గుండెలవిసేలా రోదించింది. తన ముగ్గురు పిల్లలను బలిగొన్న భర్తను కఠినంగా శిక్షించాలని అధికారులతో వేడుకుంది. కన్న తండ్రే తన ముగ్గురు కుమార్తెలను హతమార్చిన సంఘటనను చూసి తాడ్కోల్ గ్రామ ప్రజలు కంట తడి పెట్టారు. మృతదేహాలను చూసి రోదనలు మిన్నంటాయి.

Father who killed his Daughters
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News