Friday, April 19, 2024

ఎవరికీ ఏమీ ఇవ్వని డొల్ల బడ్జెట్

- Advertisement -
- Advertisement -

Finance Minister who introduced Union Budget in Lok Sabha

 

న్యూఢిల్లీ: కొవిడ్ మహమ్మారి వేళ ఎన్నో ఆశలతో యావత్ దేశ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న కేంద్ర బడ్జెట్ వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ కష్టాలకు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తారని ఆశించిన మధ్యతరగతి, పేద ప్రజలకు నిరాశే మిగిలింది. 2022 -23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను మంగళవారం లోక్‌సభలో ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి తాయిలాల జోలికి అసలు వెళ్లనే లేదు. మహమ్మారి కారణంగా కుదేలయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం ఇవ్వడంతో పాటుగా ఉపాధి కల్పనకు పెద్ద పీట వేస్తూ, ఆర్థిక వ్యవస్థకు ప్రధాన రంగాలయిన రైల్వేలు, హైవేలు లాంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భారీగా నిధులు ఖర్చు చేయడంతో పాటుగా విద్యుత్ వాహనాలు, సన్నకారు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు( ఎంఎస్‌ఎంఇ)లాంటి రంగాలకు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటుగా వ్యవసాయ రంగాన్ని హైటెక్ వైపుగా మళ్లించడానికి చర్యలను ప్రకటించారు.

ఇందు కోసం రూ. మూల ధన వ్యయాన్ని గత ఏడాదికన్నా 35 శాతం అంటే రూ.7.5 లక్షల కోట్లకు పెంచారు. మొత్తం రూ.39,45 కోట్ల భారీ అంచనాతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. దాదాపు గంటన్నరకు పైగా సాగిన నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగంలో 5జి సేవలు, ఇపాస్‌పోర్టు, క్రిప్టో కరెన్సీపై పన్ను, డిజిటల్ కరెన్సీ లాంటివే కీలక ప్రకటనలుగా నిలిచాయి.‘ప్రజలపై అధిక పన్నులు వేయడం ద్వారా నిధులు సేకరించాలని మేము ప్రయత్నించలేదు. ఎందుకంటే మహమ్మారి సమయంలో ప్రజలపై మరింత భారం వేయాలని మేము కోరుకోవడం లేదు’ అని బడ్జెట్ అనంతరం మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

అందుకే గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలపై భారీగా ఖర్చు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. 5జి స్పెక్ట్రమ్ వేలం, జాతీయ రహదారులను మరో 25 వేల కిలోమీటర్లు విస్తరించడం, నదుల అనుసంధానం, 2000 కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్ విస్తరణ, మరో 400 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశపెట్టడంలాంటివి వీటిలో ప్రధానమైనవి.

డిజిటల్ కరెన్సీ

డిజిటట్ రూపీతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనేబ్లాక్ చైన్ సాంకేతికతతో భారత రిజర్వ్ బ్యాంక్( ఆర్‌బిఐ)డిజిటల్ కరెన్సీకి రూపకల్పన చేస్తుందని వెల్లడించారు.

క్రిప్టో కరెన్సీలపై 30 శాతం పన్ను

క్రిప్టో కరెన్సీలపై 30 శాతం పన్ను విధిసున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. వర్చువల్, డిజిటల్ ఆస్తులన్నిటికీ ఈ పన్ను వర్తిస్తుంది. ఐటి రిటర్న్‌ల దాఖలుకు ఈ బడ్జెట్‌లో వెసులుబాటు లభించింది. ఆదాయం పన్ను చెల్లింపుల్లో సవరణలను అప్‌డేట్ చేసుకునే వెసులుబాటును రెండేళ్లకు పెంచారు. రిటర్న్‌లు సమర్పించిన తర్వాత రెండేళ్లలో సవరణలు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇది ఏడాది ఉంది. అయితే వ్యక్తిగత ఆదాయపన్ను శ్లాబులలో మార్పులు చేస్తారని ఆశించిన వేతన జీవులకు నిరాశేమిగిలింది. పన్ను శ్లాబులలో ఎలాంటి మార్పులూ చేయలేదు.

5జి సేవలు

దేశవ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలోనే 5 జి సేవలు అందుబాటులోకి వస్తాయని ఆర్థిక మంత్రి ప్రకటించారు. విదేశాలకు ప్రయాణాలు చేసే వారి కోసం ఇపాస్‌పోర్టును తీసుకు రాన్నుట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ విధానం వల్ల ప్రయాణికులకు ఎంతో భద్రత, ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. ప్రయాణాల సమయంలో ఇమిగ్రేషన్ ప్రక్రియ సులభతరం అయ్యేందుకు ఇది చాలా ఉపయోగపడుతుందని మంత్రి చెప్పారు.

ఇ వెహికిల్స్‌కు ప్రోత్సాహం

ఎలక్ట్రానిక్ వాహన రంగానికి బడ్జెట్‌లో భారీ మద్దతు ప్రకటించారు. బ్యాటరీల అభివృద్ధికి, మార్పులకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించనున్నట్లు మంత్రి తెలిపారు.అధునాతన సౌకర్యాలతో రానున్న మూడేళ్లలో 400 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.అలాగే వచ్చే మూడేళ్లలో 100 గతిశక్తి టెర్మినల్స్‌కూడా అందుబాటులోకి రానున్నాయి. ఎంఎస్‌ఎంఇ సెక్టార్‌కు ఊతం ఇచ్చే విధంగా మరిన్ని చర్యలు తీసుకొంటున్నట్లు న్నట్లు నిర్మలమ్మ తెలిపారు.

మూలధనం వ్యయం పెంపు

2022 23ఆర్థిక సంవత్సరంలో మూలధనం వ్యయం 35.4 శాతం పెరిగి రూ.7.5లక్షల కోట్లకు చేరింది. 2022 23 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 6. 9 శాతం ఉండవచ్చని అంచనా వేసున్తన్నామని, దాన్ని 2025 26 సంవత్సరానికి 4.5 శాతానికి తగ్గించడం ప్రభుత్వ లక్షమని నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకోవడం ఆటుపోట్లను తట్టుకోగల మన వ్యవస్థ బలానికి నిదర్శనమని బడ్జెల్ ప్రసంగం సందర్భంగా మంత్రి చెప్పారు. అందుకే అభివృద్ధికి ఈ బడ్జెట్ మరింత ఊతం కొనసాగిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News