Friday, April 19, 2024

ట్విట్టర్ ఇండియా ఎండి మహేశ్వరిపై మరో కేసు

- Advertisement -
- Advertisement -

ట్విట్టర్ ఇండియా ఎండి మహేశ్వరిపై మరో కేసు
తప్పుడు మ్యాప్‌ను ప్రచురించినందుకు కేసు పమోదు చేసిన యుపి పోలీసులు
నోయిడా: సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్ భారత విభాగం ఎండి మనీశ్ మహేశ్వరిపై మరో కేసు నమోదు అయింది. జమ్మూ, కశ్మీర్, లడఖ్‌లను వేరే దేశంగా పేర్కొంటూ తమ వెబ్‌సైట్‌లో తప్పుడు మ్యాప్‌ను ప్రచురించినందుకు గాను ట్విట్టర్ సీనియర్ అధికారులపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. యుపిలోని ఖజ్రానగర్ పోలీసు స్టేషన్‌లో బజరంగ్‌దళ్ కార్యకర్తల ఫిర్యాదు మేరుకు మనీష్ మహేశ్వరితో పాటుగా న్యూస్ పార్టర్‌షిప్ ఎడిటర్ అమృతా త్రిపాఠీలపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. జమ్మూ, కశ్మీర్, లడఖ్‌లను వేరే దేశంగా చూపిస్తూ ఒక తప్పుడు మ్యాప్‌ను ట్విట్టర్ సోమవారం తన వెబ్‌సైట్‌లోప్రదర్శించడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీంతో ఆ సామాజిక మాధ్యమ సంస్థపై విరుచుకు పడ్డ నెటిజన్లు ‘ ట్విట్టర్ బ్యాన్’ అంటూ వేలకొద్దీ పోస్టులు చేశారు.

దీంతో స్పందించిన ట్విట్టర్ కొద్ది గంటల్లోనే ఆ పోస్టును తొలగించింది. అయితే దేశ భౌగోళిక స్థితిగతులను ట్విట్టర్ తప్పుగా చూపించడం ఇదే మొదటిసారి కాదు. గత అక్టోబర్‌లో లేహ్‌ను చైనాలో అంతర్భాగంగా చూపించింది. దేశ సార్వభౌమత్వం, సమగ్రతలకు ఏమాత్రం భంగం కలిగించినా సహించేది లేదని అప్పట్లో కేంద్రం తీవ్రస్థాయిలో హెచ్చరించింది. కాగా ట్విట్టర్ ఎండి మహేశ్వరిపై ఇది రెండో కేసు కావడం గమనార్హం. ఐటి నిబంధనలను అమలు చేయనందుకుగాను ట్విట్టర్ భారత్‌లో తన మధ్యవర్తిత్వ హోదాను కోల్పోయింది. ఈ నేపథ్యంలో యుపిలోని ఘజియాబాద్‌లో ఓ వృద్ధుడిపై దాడి ఘటనలో గత వారం అక్కడి పోలీసులు ట్విట్టర్ ఎండిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలంటూ సమన్లు కూడా జారీ చేశారు. అయితే దీనిపై ఆయన కర్నాటక హైకోర్టును ఆశ్రయించడంతో ముందస్తు బెయిలు మంజూరయింది. అయితే ట్విట్టర్ ఎండికి రక్షణ కల్పిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై యుపి పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఐటి నిబంధనల విషయంలో గత కొన్ని రోజులుగా ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే.

FIR Filed against Twitter India MD Manish Maheshwari

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News