ఒకే వ్యక్తికి ఒకేసారి రెండు వేరియంట్లు
దిస్పూర్ : దేశంలో తొలిసారిగా కరోనా డబుల్ ఇన్ఫెక్షన్ కేసు నమోదైంది. అసోంలో ఓ మహిళా వైద్యురాలు ఒకేసారి అల్ఫా, డెల్టా వేరియంట్ల బారిన పడ్డట్టు నమూనా పరీక్షలో నిర్ధారణ అయింది. మొదట ఆమె భర్త అల్ఫా వేరియంట్ బారిన పడ్డారని , అయితే ఆ వైద్యురాలు టీకా రెండు డోసులు వేయించుకున్నారని అసోం దిబ్రూగడ్ జిల్లా లాహోవాల్ ఐసిఎంఆర్ రీజినల్ మెడికల్ రీసెర్చి సెంటర్ నోడల్ అధికారి బిశ్వాజ్యోతి బొర్కాకోటి చెప్పారు. ప్రస్తుతం ఆమెకు లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇటీవల బెల్జియంకు చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు డబుల్ ఇన్ఫెక్షన్కు గురైన సంగతి తెలిసిందే. ఆమెలో ఒకేసారి ఆల్ఫా, బీటా వేరియంట్లను గుర్తించారు. ఆ తరువాత ఆమె ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ వృద్ధురాలు అసలు టీకా వేయించుకోలేదని ఆమెను పరీక్షించిన వైద్యులు తెలిపారు.