Saturday, April 20, 2024

క్రికెటర్లకు ఫిట్‌నెస్ సవాల్..!

- Advertisement -
- Advertisement -

క్రికెటర్లకు పరీక్షా సమయం
ఫిట్‌నెస్ కాపాడు కోవడం సవాలే!

ముంబై: పలు ఆటంకాల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్‌కు మార్గం సుగమం అయిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యుఎఇ వేదికగా ఈ టోర్నీ జరుగనుంది. ఇక భారత ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతులు లభించడంతో టోర్నీ నిర్వహణకు ఉన్న అతి పెద్ద అడ్డంకి కూడా తొలగిపోయింది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఈసారి ఐపిఎల్‌కు ఆతిథ్యం ఇస్తోంది. కరోనా భయం నేపథ్యంలో సాగుతున్న ఈ టోర్నీ ఎంతవరకు సఫలం అవుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా భారత క్రికెట్ బోర్డు మాత్రం టోర్నీ విజయవంతం కావడం ఖాయమనే నమ్మకంతో ఉంది. 8 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ బయో సెక్యూర్ విధానంలో జరుగనుంది. కరోనా భయం పూర్తిగా తొలగక పోవడంతో ఇటు బిసిసిఐకి అటు ఎమిరేట్స్ బోర్డుకు ఐపిఎల్‌ను సజావుగా నిర్వహించడ అనుకున్నంత తేలికకాదనే చెప్పాలి. మరోవైపు ఈ టోర్నీ ఆటగాళ్లకు కూడా చాలా కీలకమనే చెప్పక తప్పదు. కరోనా కారణంగా చాలా నెలలుగా ఎక్కడి క్రికెట్ అక్కడే నిలిచి పోయిన విషయం తెలిసిందే. మార్చి నెల తర్వాత చాలా మంది క్రికెటర్లకు కనీసం ప్రాక్టీస్ చేసే అవకాశం కూడా లభించలేదు. భారత్‌లో కరోనా తీవ్రత తగ్గక పోవడంతో ఇంకా పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కొనసాగుతూనే ఉంది. దీంతో అన్‌లాక్ పక్రియ ప్రారంభమై చాలా రోజులు గడుస్తున్నా ప్రధాన నగరాల్లోని క్రికెటర్లు ప్రాక్టీస్‌కు నోచుకోలేక పోయారు. ఇలాంటి సమయంలో విపరీత ఒత్తిడి ఉండే ఐపిఎల్ వంటి మెగా టోర్నమెంట్‌లో ఆడడం ప్రతి క్రికెటర్‌కు క్లిష్టంగా మారింది.

శ్రమించక తప్పడం లేదు
మరోవైపు సుదీర్ఘ విరామం తర్వాత క్రికెటర్లు బరిలోకి దిగుతున్న తొలి టోర్నమెంట్ ఐపిఎల్ మాత్రమే. కొంత మంది ఇంగ్లండ్, వెస్టిండీస్ క్రికెటర్లకు తప్పించి మిగతా వారికి కనీస ప్రాక్టీస్ కూడా లేకుండా పోయింది. వారంత నేరుగా ఐపిఎల్‌లోనే బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా మంది క్రికెటర్లకు క్లిష్టంగా తయారైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కరోనా వల్ల నెలల తరబడి క్రికెట్‌కు దూరంగా ఉండాల్సిన స్థితి చాలా దేశాల క్రికెటర్లకు ఏర్పడింది. కనీసం దేశవాళి క్రికెట్ కూడా లేకుండానే క్రికెటర్లు ఐపిఎల్‌కు సిద్ధం కాక తప్పడం లేదు. భారత్‌లోని ముంబై, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు, జైపూర్ వంటి ప్రధాన నగరాల్లో ఉండే స్టార్ ఆటగాళ్లకు కూడా కనీస సాధన లేకుండా పోయింది. ఈ నగరాల్లో పలు ఆంక్షలు అమల్లో ఉండడంతో చాలా మంది క్రికెటర్లు సాధన చేయలేక పోయారు.

మరోవైపు ఐపిఎల్ జరగడంపై కూడా పలు అనుమానాలు ఉండడంతో పలువురు క్రికెటర్లు తొలుత సాధనపై ఆసక్తి చూపలేదు. ఇటువంటి స్థితిలో పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ను అందుకోవడం క్రికెటర్లకు సవాలుగా తయారైంది. విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, మహేంద్ర సింగ్ ధోనీ, బుమ్రా, రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, షమి, ఉమేశ్, జడేజా, హార్దిక్, రిషబ్, అయ్యర్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఫిట్‌నెస్‌పై దృష్టి సారించారు. దీని కోసం వీరంత నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ధోనీ, రైనాలు ఇప్పటికే సాధన కూడా ఆరంభించారు. షమి, అయ్యర్, హార్దిక్, పంత్ తదితరులు కూడా ఐపిఎల్ కోసం కసరత్తు చేస్తున్నారు. మరోవైపు విదేశీ క్రికెటర్లు సయితం ఫిట్‌నెస్‌ను సంతరించు కునేందుకు నడుం బిగించారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, అఫ్గాన్, బంగ్లాదేశ్, విండీస్ తదితర దేశాలకు చెందిన క్రికెటర్లు ఈసారి ఐపిఎల్‌కు కీలకంగా మారారు. దీంతో వీరంత పూర్తి ఫిట్‌నెస్‌ను సాధించాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. ఇందులో వారు ఎంత వరకు సఫలమవుతారో బరిలోకి దిగితేకానీ తెలియదు.

Fitness challenge to cricketers during lockdown

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News