భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెల బలవన్మరణం
సంఘటన స్థలంలో 9 నెలల మృత శిశువు
బెంగళూరు : బెంగళూరుకు సమీపాన బ్యాడరహళ్లి నాల్గవ క్రాస్లో నివాసం ఉంటున్న హళ్లెగెరె శంకర్ కుటుంబం లోని ఐదుగురు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్ణాటకలో కలకలం రేపుతోంది. వీరంతా నాలుగు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోగా, శుక్రవారం రాత్రి వెలుగు లోకి వచ్చింది. శంకర్ శాసక పేరుతో మినీ పత్రిక నిర్వహిస్తున్నారు. ఆయన ఇంటిలో లేని సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులను శంకర్ భార్య భారతి (50),కుమారుడు మధుసాగర్ (27),కుమార్తెలు సించనా (33),సింధూరాణి (30)గా గుర్తించారు.
మూడు రోజులుగా ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో స్థానికులు శుక్రవారం సాయంత్రం ఇంటి కిటికీ అద్దాలను పగుల గొట్టి చూసేసరికి ఐదుగురూ విగత జీవులై కనిపించారు. మూడేళ్ల చిన్నారి ప్రేక్ష అన్నం నీళ్లు లేక సొమ్మసిల్లిన స్థితిలో ఉండడంతో ఆ చిన్నారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ చిన్నారి మృతురాలు సించనా కుమార్తెగా గుర్తించారు. మృతి చెందిన 9 నెలల ఆడ శిశువు ఎవరి బిడ్డ అనేది తెలియరాలేదు. శిశువును గొంతు పిసికి చంపినట్టు ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. కుటుంబ కలహాలే దీనికి కారణంగా అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ కోసం విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.