* నిందుతుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబీకులు, స్ధానికుల ఆందోళన ….
* పసి వాడి ప్రాణం ఖరీదు లక్షన్నర..?
* కేసు నమోదు కాకుండా రాయబేరం నెరపిన ‘ పెద్ద మనిషి ’…!
మల్కాజిగిరి : ఓ అపార్ట్మెంటులో కారు రివర్స్ తీస్తుండగా మూడేళ్ల బాలుడు చక్రాల కింద పడి మృతి చెందిన సంఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబునగర్ జిల్లా మగనూర్ మండలం వడ్వాట్ గ్రామానికి చెందిన రంగప్ప మల్కాజిగిరి ఆనంద్బాగ్ రోడ్డు నెంబర్ 11లోని వెంకట్ ప్లాజా అపార్ట్మెంటులో వాచ్మెన్గా పని చేస్తూ భార్య పిల్లలతో కలిసి ఇదే అపార్ట్మెంటులో ఉంటున్నాడు. కాగా, శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇదే అపార్ట్మెంట్కు చెందిన జె. మనోహర్ సుధాకర్ (48) అనే ఓ ప్రైవేటు ఉద్యోగి.
సెల్లారులోని తన కారును నిర్లక్ష్యంగా రివర్స్ చేస్తుండగా వెనుకనే ఉన్న వాచ్మెన్ కుమారుడు చాకలి తరుణ్ (5) కారు చక్రాల కింద పడి అక్కడిక్కడే మృతి చెందాడు. అప్పటి వరకు ఆడుకుంటూ ఉన్న బాలుడు, కారు చక్రాల కింద పడి కన్నుమూయడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. దీంతో స్ధానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. కాగా, మృతుడి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి పోలీసులు నిందుతుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిర్లక్ష్యంగా కారు నడిపి, తమ చిన్నారి ప్రాణాలని పొట్టబెట్టుకున్న నిందుతుడిని కఠినంగా శిక్షించాలని, మృతుడి కుటుంబానికి రూ 7 లక్షలు నష్ట పరిహరం చెల్లించాలని స్దానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనలో నిందుతుడిపై కేసు నమోదు కాకుండా మల్కాజిగిరికి చెందిన ఓ పెద్ద మనిషి రంగంలోకి దిగి మీకు తగిన న్యాయం చేస్తానంటూ నమ్మబలికి మృతుడి కుటుంబీకులను, స్ధానికులను శాంతింప చేశారు.
ముక్క పచ్చలారని పసివాడి ప్రాణానికి లక్షన్నర ఖరీదు కట్టి, ఖేల్ ఖతం దుకాణం బంద్ అనడంతో స్ధానికులు నివ్వెర పోయారు. మిగిలిన మొత్తం ఇన్సూరెన్స్ క్లయిమ్ చేసుకొని తీసుకోండి.. ఇంకా మీకు ఇచ్చేదేమి లేదు… మీ దిక్కున్న చోట చెప్పుకోండంటూ సదరు పెద్ద మనిషి చేతులు ఎత్తి వేయడంతో, స్ధానికులు ఆయన వ్యవహర శైలి పట్ల తీవ్ర ఆగ్రహాం, అసంతృప్తిని వ్యక్తం చేశారు. పసివాడి ప్రాణాన్ని లక్షన్నరకు ఖరీదు కడతారా అంటూ స్ధానికులు, మృతుడి కుటుంబీకులు విమర్శించారు.