బెంగళూరు : పండగ సీజన్కు ముందు ఇకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ భారీగా ఉద్యోగులను నియమించుకునేందుకు సిద్ధమైంది. వివిధ విభాగాల్లో దాదాపు 70 వేల మందిని నియమించుకోనున్నట్టు వాల్మార్ట్కు చెందిన ఫ్లిప్కార్టు ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆన్లైన్ షాపింగ్ పెరిగింది. ఇక పండగ సీజన్ సమీపిస్తుండడంతో డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు ఫ్లిప్కార్ట్, అమెజాన్, మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన ఇకామర్స్ బిజినెస్ కూడా సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు స్మార్ట్ఫోన్లు అందరికీ సాధారణం కావడం తో షాపింగ్ ఇంకా సులువు అయింది.
ఫ్లిప్కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’, అలాగే అమెజాన్ ప్రైమ్ డే వంటి సేల్స్ పోటాపోటీగా పెద్దఎత్తున ఉంటాయి. నాలుగు నుంచి ఐదు రోజుల పాటు జరిగే ఈ పండగ సేల్స్ అక్టోబర్ నుంచి ప్రారంభమై, దీపావళికి వరకు ఉంటాయి. ఇప్పుడు కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఆన్లైన్ సేల్స్ మరింతగా పెరగడం, పండగకు కూడా షాపింగ్ డిమాండ్ ఎక్కువగా ఉంటుందని భావించిన సంస్థలు ఆఫర్లతో సిద్ధమవుతున్నాయి. ఇదే సమయంలో పోటీ పెరగడంతో డెలివరీ సేవలను వేగవంతం చేసేందుకు భారీఎత్తున ఉద్యోగులను తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి.