కరీంనగర్: కొండపాక మాజీ ఎంపిటిసి దంపతుల హత్యకేసులో నిందితులైన అదే గ్రామానికి చెందిన సంగెం ఓదెలు(70), అతని కుమారులు సంగెం హనుమంతు(50), రాజేశం(30)లను బుధవారం కరీంనగర అడిషనల్ డిసిపి శ్రీనివాస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా డిసిపి శ్రీనివాస్ విలేకర్ల సమావేశంలో హత్యకు గల కారణాలను వెల్లడించారు. జిల్లాలోని వీణవంక మండలంలోని కొండపాక మాజీ ఎంపిటిసి దంపతులు పూరెల్ల సుశీల-పోశయ్య హత్య భూమివివాదం కారణంగానే జరిగిందని తెలిపారు. ఇదే గ్రామానికి చెందిన సంగెం ఓదెలు, అతని కుమారులకు, హత్య గావింపబడిన మాజీ ఎంపిటిసి దంపతులకు గత కొన్ని సంవత్సరాలుగా 8గుంటల భూమి విషయంలో వివాదం నడుస్తోంది. పలుమార్లు ఇరువర్గాల వారు కేసులు పెట్టుకున్నారు. కేసులు కోర్టుల్లో నడుస్తున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో మంగళవారం సుశీల-పోశయ్యలు వివాదంలో ఉన్న 8గుంటల భూమిని దున్నేందుకు ప్రయత్నం చేస్త్తుండగా.. ప్రత్యర్థులు ఓదెలు, అతని కుమారులు హన్మంతు, రాజేశంలు అక్కడకు చేరుకుని గొడవకు దిగారు. గొడవలో హన్మంతు, రాజేశంలు వెంటతెచ్చుకున్న కత్తులు, గొడ్డలితో పోశయ్యను వేటేసారు. దీంతో పోశయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. సుశీల పరుగుతీస్తూ రోడ్డు మీదకు రాగా ఆమెను రోడ్డుపై పడవేసి గొంతుకోసి చంపినట్లు వివరించారు. ఈ ఘటనలో సాక్షులను విచారించి, 24 గంటలు గడవక ముందే నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.
Former MPTC Couple Killed in Karimnagar