వనపర్తి: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషాదఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మృతులు తల్లి ఆజీరాం బీ (63), కుమార్తె ఆస్మా బేగం (35), అల్లుడు ఖాజాపాష (42), మనుమరాలు హసీన (10)గా గుర్తించారు. వీరు ఇంట్లో వేర్వేరుచోట్ల విగతజీవులై పడిఉన్నారు. వంటగదిలో ఆజీరాం బీ మృతదేహాన్ని, డైనింగ్ హాల్లో ఆస్మా బేగం మృతదేహాన్ని, ఇంటి వెనుక గుంతలో ఖాజాపాష మృతదేహాన్ని, హాల్లో హసీనా మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఆధారాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతులు ఆత్మహత్యకు పాల్పడ్డారా..? లేక ఎవరైనా హత్య చేశారా..?అన్నది పోస్టు మార్టం రిపోర్ట్ ద్వారా క్లారిటీ రానుంది. ఇంటి ఆవరణలో నిమ్మకాయలు, అగరబత్తీలు, కుంకమ వంటివి అక్కడ క్షుద్ర పూజలు జరిగాయా అన్న అనుమానాలకు తావిస్తున్నాయి. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది.