న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత వ్యాక్సిన్ హామీని చేర్చడం ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని కేంద్ర ఎన్నికల సంఘం (ఇసి) స్పష్టం చేసింది. సమాచార హక్కు ఉద్యమనేత సాకేత్ గోఖలే చేసిన ఫిర్యాదుపై ఇసి స్పందించి వివరణ ఇచ్చింది. ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగాని పాల్పడుతోందని, భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఈ హామీ వివక్షాపూరితంగా ఉందని సాకేత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మేనిఫెస్టో రూపకల్పన విషయంలో పార్ట్ 8 లో పొందుపర్చిన ఏ నిబంధననూ ఉచిత టీకా హామీ ఉల్లంఘించ లేదని ఇసి వివరించింది. రాజ్యాంగంలో పేర్కొన్న రాష్ట్ర విధాన నిర్దేశిక సూత్రాల ప్రకారం ప్రజా సంక్షేమం కోసం పార్టీలు సాధ్యమైన ఎటువంటి హామీలనైనా మేనిఫెస్టోలో పొందుపర్చవచ్చని గుర్తు చేసింది. ఇసి సమాధానంపై గోఖలే అసంతృప్తి వ్యక్తం చేశారు. బిజెపి కేవలం ఒక్క బీహార్ రాష్ట్రానికే ఈ హామీ ఇచ్చిందన్న విషయాన్ని ఇసి విస్మరించిందని ఆయన వ్యాఖ్యానించారు.