రోడ్లు, భవనాలకు రూ. 3493.67 కోట్లు
గత ఏడాది రూ. 1411.94 కోట్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రోడ్ల, రవాణాభివృద్ధికి 2020_21 వార్షిక బడ్జెట్లో రూ. 3493.67 కోట్లుగా కేటాయింపులు జరిపారు. గత ఏడాది కేటాయింపులు రూ. 1411.94 కోట్లుగా ఉన్నది. గత ఏడాదికన్నా ఈ ఏడు రూ. 2081.73 కోట్లు అధికం. ఈ బడ్జెట్లో నిర్వహణా పద్దులో రూ. 1930.39 కోట్లుగా, ప్రగతి పద్దులో రూ. 1563.27 కోట్లుగా అంచనా వేసింది. రోడ్డు రవాణా రంగానికి రూ. 600 కోట్లు, రోడ్డు రవానా రంగానికి రుణాలుగా రూ. 931.82 కోట్లు, రోడ్లు, వంతెనలకు గాను రూ. 125.96 కోట్లుగా కేటాయింపులు చేశారు.
ప్రజా పనులకు రూ. 185.58 కోట్లు, రోడ్డు, వంతెనలపై పెట్టుబడి వినియోగపు అంచనా మొత్తం రూ. 1320.84 కోట్లు, ప్రజాపనులపై పెట్టుబడి, వినియోగం, గృహనిర్మాణంపై పెట్టుబడిగా రూ. 326.80 కోట్లు, జిల్లా రహదారుల పనులు, భూములకు రూ. 335 కోట్లు, రహదారుల నెట్వర్క్కు రూ. 230 కోట్లు, రేడియల్ రోడ్లు, భూములకు రూ. 90 కోట్లు, జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల నిర్మాణానికి రూ. 275 కోట్లు, తెలంగాణ కళాభారితికి రూ. 50 కోట్లు, రైల్వే భద్రత నిర్మాణంలో రోడ్లు, వంతెనలకు రూ. 155 కోట్లు, కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి రైల్వేల్లో డిపాజిట్లుగా రూ. 100 కోట్లు, గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రూ. 90 కోట్లు, రవాణా విభాగంలో వాహనాలపై పన్నులుగా రూ. 73.45 కోట్లుగా వార్షిక బడ్జెట్లో కేటాయింపులున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ప్రధాన రహదారులు జాతీయ రహదారుల కేటగిరీలోకి చేరాయి.
ఆరేళ్ళలో..
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం ప్రభుత్వం ప్రధానంగా రోడ్డు భవనాల విభాగానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఈ క్రమంలోనే 2014-_15 లో రూ. 2943 కోట్లు, 2015_ 16 లో రూ. 4969 కోట్లు, 2016_17లో 3534 కోట్లు, 2017_18లో 3934 కోట్లు, 2018_19లో 3100 కోట్లుగా కేటాయింపులు చేసిన ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి సుమారు రూ. 10500 కోట్లు ఖర్చు చేసినట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. సుమారు 410లకు పైగా వంతెనలను సుమారు 8500 కి.మీ.ల వరకు నిర్మించినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం చుట్టూర ఉన్న రీజినల్ రింగ్ రోడ్, మహబూబ్నగర్ నుంచి చించోలీ వంటి రోడ్లు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోకి చేరాయి.