కోటి రూపాయల విత్తనాలు స్వాధీనం
నలుగురు అరెస్టు, పరారీలో ముగ్గురు
దాడి చేసిన బాలానగర్ ఎస్ఓటి పోలీసులు
మనతెలంగాణ, హైదరాబాదద్ : గడువు ముగిసిన పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకోగా, ముగ్గురు పరారీలో ఉన్నారు. కోటి రూపాయల విలువైన 13,000 కిలోల పత్తి విత్తనాలు, డిసిఎం వాహనం, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అత్వెళ్లికి చెందిన ముప్పనేని శివనాగేశ్వర్ రావు, సుచిత్రాకు చెందిన శాఖమూరి వెంకటేశ్వరరావు, మాడుగుండ అశ్విన్ కుమార్, అంజిరెడ్డి,సాయిరాం, శ్రీనివాస్, నాయుడు కలిసి గడువు ముగిసిన పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారు. ఇందులో సాయిరాం, శ్రీనివాస్, నాయుడు పరారీలో ఉన్నారు. సాయిరాం మేనేజింగ్ డైరెక్టర్గా సన్రైజ్ ఆగ్రో సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ను శామీర్పేట మండలం, దేవరయాంజిల్లో ఏర్పాటు చేశారు. లోథా పత్తి విత్తనాలను తమిళనాడులోని కోలాతపాలయంలోని సెంతిల్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసి ఇక్కడ విక్రయిస్తున్నారు.
వీటి ఎక్స్పైరీ గడువు 8, ఫిబ్రవరి,2020 ఉంది. లాక్డౌన్ విధించడంతో మూడు నెలలు కంపెనీని తెరవలేదు. పత్తి విత్తనాల గడువు ముగిసినా కూడా తిరిగి ఇవ్వలేదు. ఏడుగురు నిందితులు కలిసి కర్నూలు సీడ్స్ ఎండి శ్రీనివాస్తో కలిసి గడువు ముగిసిన పత్తి విత్తనాలను కర్నూలు సీడ్స్ పేరుతో అమాయకులైన రైతులకు విక్రయిస్తున్నారు. ఈ విత్తనాలు విక్రయించేందుకు వ్యవసాయ అధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేదు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్, ఎస్ఓటి ఎడిసిపి సందీప్ పర్యవేక్షణలో బాటానగర్ ఎస్ఓటి, పేట్బషీరాబాద్ పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గడువు ముగిసిన విత్తనాలను విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసిన పోలీసులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అభినందించారు.