జైపూర్: క్వారంటైన్లో ఉన్న 40 ఏళ్ల మహిళపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన సంఘటన రాజస్థాన్లోని సవాయి మదోపూర్ ప్రాంతం బటోడా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. లాక్డౌన్ నేపథ్యంలో ఓ మహిళ సవాయి మదోపూర్ ప్రాంతంలో ఉండిపోయింది. తాను జైపూర్ లో నివసిస్తోంది. సవాయి ప్రాంతం నుంచి జైపూర్కు కాలినడకన వెళ్తుండగా పోలీసులు పట్టుకొని బటోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఉంచారు. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో పోలీసులు మరో ప్రాంతం నుంచి వస్తుండడంతో సదరు మహిళను క్వారంటైన్లో ఉండాలని సూచించారు. గ్రామస్థుల సహకారంతో ఓ ప్రభుత్వ స్కూల్ లో ఆమెను క్వారంటైన్లో ఉంచారు. ఇదే అదునుగా భావించిన ముగ్గురు యువకులు ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సదరు మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం మహిళను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.