Thursday, April 25, 2024

రైతులు కన్నీరు పెడితే దేశానికి అరిష్టం: మంత్రి గంగుల

- Advertisement -
- Advertisement -

gangula kamalakar comments on central government

కరీంనగర్: జిల్లా కలెక్టరేట్ ఎదుట టిఆర్ఎస్ ధర్నాలో మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర ప్రభుత్వంపై కామెంట్స్ చేశారు. కేంద్రం తీరు దున్నపోతులాగా ఉందన్నారు. అందుకే దానిపై వర్షం కురిపించి నిరసన తెలుపుతున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు భారతీయులు కాదా? తెలంగాణ భారత దేశంలో అంతర్భాగం కాదా? మేమేమన్నా విదేశీయులమా? ధాన్యం కొనాలని అడగడం మా హక్కు. మీ మెడలు వంచైనా ధాన్యం కొనెలా ఒత్తిడి తెస్తాం. అధికార పార్టీలో ఉన్న తమను ధర్నా చేసే స్థాయికి తీసుకువచ్చింది కేంద్రం. కేంద్ర నిరంకుశ వైఖరికి నిరసనగా తామంతా రోడ్లపైకి వచ్చాం. తమకు ఉద్యమాలు కొత్తకాదు. ధాన్యం కొనాలని అడిగేందుకు ఢిల్లీకి వెళ్తే తమను ఘోరంగా అవమానించారు. సమైక్య రాష్ట్రంలో గోదావరి మా ఊరి పక్కనుంచే వెళ్లినా.. మాకు గుక్కెడు నీరు కూడా దొరకలేదు. రాష్ట్రం వచ్చాకా ప్రాజెక్టులు కట్టుకుని సాగు, తాగునీరు తెచ్చుకున్నాం. పండిన పంటను దేశ ప్రజలందరికీ సమానంగా అందించాలన్న లక్ష్యంతో పంట సేకరణ బాధ్యత కేంద్రం తీసుకుంది.

అందులో భాగంగానే ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసారు.ఏ రాష్ట్రంలో ఏ పంట పండినా వారి అవసరాలకు పోను మిగిలిన పంటను కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని రాజ్యాంగంలో చేర్చారు.అధిక ఉష్ణోగ్రతల వల్ల తెలంగాణలో పండే వరి గింజలు పగిలిపోయి నూకలుగా మారుతాయి. ధాన్యం బాయిల్డ్ చేసి మరపట్టిస్తే నూకలు కావన్న విషయం కేంద్రమే చెప్పింది. మనకు బాయిల్డ్ రైస్ చేసే విధానం నేర్పించి, పారాబాయిల్డ్ మిల్లులు పెట్టుకునేలా ప్రోత్సహించింది. ఇంతకాలం సేకరించిన కేంద్రం ఇప్పుడు బాయిల్డ్ రైస్ కొననంటోంది.మా దగ్గర జాలు పొలాల్లో, సౌడు పొలాల్లో వరి మాత్రమే పండుతుంది. అందుకే మా పంటను మీరే కొనాలి.మా వరి కొనుక్కుని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి.పంజాబ్ లో ఏసంగిలో గోదుమలు కొన్నట్లుగానే… మా దగ్గర పండే వరి ధాన్యం ఎందుకు కొనరు?చత్తీష్ గఢ్, ఏపీ, తెలంగాణ, కేరళ, పంజాబ్ లాంటి వరి పండించే రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదు కాబట్టే… కక్ష గట్టి వరి కొననంటున్నారు.

రైతులకు సాగునీరు, రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్ లాంటి సౌకర్యాలు కల్పించడంతో రైతులంతా ఇప్పుడిప్పుడే బాగుపడుతన్నారు.బాగుపడుతున్న మన రైతులపై కన్నుకుట్టి కేంద్రం కుట్రతో పంటను కొనడం లేదు.ధాన్యంతో పాటు, గోనెసంచలు కూడా కొనే అధికారం మనకు లేదు. ధాన్యం నిల్వ చేసే గోదాములు కూడా ఎఫ్.సి.ఐ దగ్గరే ఉంటాయి.గత ఏసంగి సమయంలోనే మీ పంట కొనబోమని మాకు కేంద్రం లెటర్ రాసింది.సీఎం సూచన మేరకు అప్పుడే కేటీఆర్, నేను పీయూష్ గోయల్ కు పరిస్థితి చెప్పాం.మీరేమైనా చేసుకోండి.. బాయిల్డ్ రైస్ మా దగ్గరే ఎక్కువుందని చెప్పాడు.అప్పటికే ధాన్యం సేకరించి రైతులకు 15 వేల కోట్లు చెల్లించామని చెప్పాం. రైతు పంటల కోసం పెట్టుబడిపై లాభ నష్టాలు చూడొద్దని సీఎం లేఖ రాసినా పట్టించుకోలేదు.ఈసారి పంట తగ్గించమని మేం చేసిన సూచన మేరకు రైతులు ఈసారి వరిసాగు తగ్గించారు.

మిగతా రైతులు పండించిన పంటను కొనాలని ఇటీవల మళ్లీ మేము కలిస్తే… నూకలు మీ రైతులను తినమని పీయూస్ గోయల్ అవమానించాడు.రైతుల పంటను కేంద్రం కొనాల్సిందే.రాష్ట్రంలోని రైతులంతా పార్టీలకతీతంగా రేపు ఇండ్లపై నల్లజెండాలు ఎగురవేసి కేంద్రానికి నిరసన తెలుపాలి.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని అనేక స్కీంలు రైతుల కోసం మన దగ్గర అమలు చేస్తున్నారు.అదే కళ్లమంటతో మన రైతులను కేంద్రం ఇబ్బంది పెడుతోంది.మేం చేస్తున్న ధర్నాలన్నీ మా కోసం కాదు.. రైతుల కోసమే.రైతులు కన్నీరు పెడితే ఈ దేశానికి అరిష్ఠం.శ్రీలంకలాంటి పరిస్థితి మనకు రావద్దంటే మరో ఐదేళ్లకు సరిపడా బియ్యం నిల్వలను కేంద్రం భద్రపరుచుకోవాలి.అంబాని, అదానీలకు రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టాలని చూసారు.కేంద్రం మెడలు వంచేదాకా మా పోరాటం సాగిస్తామని మంత్రి గంగుల స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News