వికారాబాద్: అనారోగ్యం బారిన పడిన కూతురును కాపాడుకునేందుకు భుజాలపై మోసుకొచ్చిన తల్లిదండ్రుల తాపత్రయం ఫలించలేదు. గ్రామ శివారులో ప్రవహిస్తున్న వాగుకు వంతెన లేని కారణంగా చిన్నారికి సకాలంలో సరైన వైద్యం అందక పరిస్థితి చేయిదాటి ప్రాణాలను విడిచింది. ఈ విషాధకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బిజ్జారం అనుబంధ గ్రామం బొంకూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బొంకూరు గ్రామానికి చెందిన బాలప్ప, అమృతమ్మల కూతురు హారిక(11) నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురైంది. అయితే బిజ్జారం–బొంకూరు గ్రామాల మద్య ఉన్న కాగ్నానది భారీ వర్షాల కారణంగా ఉధృతంగా ప్రవహించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోయారు. బాలిక ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆందోళనకు గురైన తల్లిండ్రులు గ్రామానికి మరోవైపు ఉన్న పెద్దేముల్ మండలం రుక్మాపూర్ మీదుగా తరలించేందుకు ట్రాక్టర్ను ఏర్పాటు చేసుకున్నారు. కాని ఆ మార్గంలో కూడ భారీ వర్షాలకు పొలాలన్ని నిండిపోవడంతో దారి బురదమయంగా మారింది. శుక్రవారం బాలికను ట్రాక్టర్ ద్వారా తరలిస్తుండగా మార్గమద్యలో ట్రాక్టర్ బురదలో ఇరుక్కుపోయింది.
భుజాలపై మోసుకొచ్చినా..
దిక్కుతోచని స్థితిలో కుటుంభీకులు బాలికను రైలు పట్టాల గుండా తాండూరుకు చేరుకున్నారు. ఆ పట్టాల మీదుగా బాలికను భుజాలపై మోసుకువచ్చారు. తాండూరులోని జిల్లా ఆసుపత్రిలో చేర్పించగా బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించాలని సూచించారు. అదేరోజు రాత్రి బాలికను హైదరాబాద్లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం బాలిక మృతి చెందింది.
వాగుపై వంతెన లేక
గ్రామ శివారులోని వాగుపై వంతనెల లేకపోవడంతో బాలికను సకాలంలో ఆసుపత్రికి తరలించలేకపోయామని తల్లిదండ్రులు వాపోయారు. వాగుపై వంతెన ఉంటే సకాలంలో వైద్యం అంది బాలికను కాపాడుకునే వారమని కన్నీరు మున్నీరయ్యారు. మరోవైపు గ్రామానికి కాగ్నానదిపై వంతెన నిర్మించాలని మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కోరడం జరిగిందని బిజ్జారం సర్పంచ్ ద్యావరి నరేందర్రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా కాగ్నానదిపై వంతెన నిర్మాణానికి చొరవ చూపాలని కోరారు.
Girl died due to not timely treatment in Vikarabad