Tuesday, April 16, 2024

మా భూములు మాకివ్వండి

- Advertisement -
- Advertisement -

Give us our lands:Jamuna hatcheries victims

ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో జమున హాచరీస్ బాధిత రైతుల గోడు

మెదక్ ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటల్లోని 130 సర్వే నెం. రైతులు
తాము ఎవరికీ భూములు అమ్మలేదని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి

మన తెలంగాణ/ మెదక్ : మెదక్ జిల్లామాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హక్కీంపేట 130 సర్వే నెంబర్‌కు సంబంధించి రైతులు అనిత, కలమ్మ, శ్రీనివాస్, రాజమ్మ, లక్ష్మీ రాంచెందర్, చాకలి బుచ్చయ్య, నాగులు, రవి తమ భూములను జమునా హేచరీస్ అక్రమంగా లాక్కున్నారని తెలిపారు. మంగళవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి బాధిత రైతులు చేరుకుని తమకు న్యాయం చేసి తమ భూములను తమకు ఇప్పించాలని కోరారు. తమ భూములను ఎవరికీ అమ్మలేదని, ఆ భూములలో తాము మొక్కజొన్న పంట సాగు చేసుకున్నామని రైతులు తెలిపారు. రైతులుగా తాము అనుభవించాల్సిన భూములు దర్జాగా ఆక్రమణదారులు అనుభవిస్తూ తమల్ని మోసం చేశారని రైతులు ఆరోపించారు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన విచారణ నివేదిక తమకు సంతృప్తిని ఇచ్చిందని, విచారణలో తమకు న్యాయమే జరిగిందని, ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని తమ భూములను తమకు ఇప్పిస్తే పంటలు సాగు చేసుకొని జీవిస్తామని రైతులు తెలిపారు.

ముక్కు నేలకు రాస్తానన్న మాటలు ఏమాయే

జమునా హేచారీస్ పరిశ్రమలో ఒక్క గుంట అయినా భూమిని కబ్జా చేస్తే ముక్కు నేలకు రాస్తా అన్న ఈటల రాజేందర్ మాటలు ఏమయ్యాయని జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చట్ట విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టి, కోట్లాది రూపాయలు గడిస్తున్నారని, బాధిత రైతులు తమకు న్యాయం కావాలని ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకవెళ్లారని, వెంటనే అధికారులు స్పందించి సర్వే నిర్వహించారని అన్నా రు. జిల్లా కలెక్టర్ నివేదికలో జమున హేచరీస్ వారు 70 ఎకరాల 33 గుంటల అసైన్డ్ భూమిని కబ్జా చేశారని కలెక్టర్ తెలిపారని అన్నారు. చట్ట విరుద్దంగా అసైన్డ్ భూములను, ప్రభుత్వా భూములను అమ్మడం, కొనడం నేరమని తెలిసి కూడా మంత్రి హోదాలో ఉండి రైతుల భూమలను కబ్జా చేయడం నేరమని, చట్టం తన పని తాను చేసుకుంటుందని తెలిపారు. ఈటల జమున జిల్లా కలెక్టర్ ను పార్టీ రంగుపేరుతో ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. అచ్చంపేట, హక్కింపేట గ్రామానికి చెందిన రైతుల భూములను కబ్జా చేశారో వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకుని, రైతులకు న్యాయం చేస్తుందని అన్నారు.

ఆ భూములను చట్టవిరుద్ధంగా కొనుగోలు చేశారు

ఈటల జమున ఆరోపణలపై మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ స్పందన

ఈటల రాజేందర్ సతీమణి జమున చేసిన ఆరోపణలపై మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ స్పందించారు. మంగళవారం వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలపై ఆయన మాట్లాడారు. భూముల సర్వే సమయంలో జమున హేచరీస్ ప్రతినిధులు హాజరై పంచనామాలో సంతకాలు చేశారని, వాస్తవాలు ఇలా ఉంటే ఆమె ప్రెస్‌మీట్‌లో మరోలా మాట్లాడారని కలెక్టర్ హరీష్ తెలిపారు. మాసాయిపేట మండల పరిధిలోని అచ్చంపేట గ్రామ సర్వేనంబర్ 81, 130 లలో పట్టా భూమి లేదు. సీలింగ్, అసైన్డ్ మాత్రమే ఉందన్నారు. 130 సర్వే నంబర్ లో భూమిలేని పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూమిని జమున హేచరిస్ అక్రమంగా అక్రమించుకుందని, సర్వే 81 లో భూమి లేని 7గురికి అసైన్డ్ చేయబడిందని ఆయన తెలిపారు. 2011లోనే ఈ భూమిని నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చబడిందని, ఈ సర్వే నంబర్‌లో 14 ఎకరాల అక్రమంగా అక్రమించారని కలెక్టర్ పేర్కొన్నారు. రెండు సర్వే నంబర్లలో 8.36 ఎకరాల భూమిని చట్ట విరుద్ధంగా తన పేరిట జమున కొనుగోలు చేశారు. రెండు సర్వే నంబర్లలోని 33 ఎకరాల భూమిని గతంలో 18 మంది పేదలకు పంపిణీ చేసినట్లు తెలిపారు.

ప్రభుత్వ భూమిలో జమున హేచరీస్ యాజమాన్యం రోడ్లు, భారీ పౌల్ట్రీ షెడ్లను అక్రమంగా నిర్మించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాల్టా చట్టం ఉల్లంఘించి అటవీ ప్రాంతంలో రోడ్లు వేశారని తెలిపారు. బాధిత అసైన్డ్ భూముల రైతులకు న్యాయం చేసేలా ప్రభుత్వానికి నివేదిక పంపామని ఆయన తెలిపారు. ఈ భూముల్లో అక్రమంగా పౌల్ట్రీ షేడ్‌లు నిర్మించారని, ఈ భూమిని అక్రమంగా కొనుగోలు చేసి తెల్లకాగిత లావాదేవీల ద్వారా అమ్మకానికి పెట్టినట్టు రికార్డ్‌లు ఉన్నాయని ఆయన వెల్లడించారు. భూముల సర్వే సమయంలో జామున హేచరిస్ ప్రతినిధులు హాజరై పంచనామాలో సంతకాలు చేశారని, ఈటల జమున చేసిన ప్రకటన సరైనది కాదన్నారు. జమున కొనుగోలు చేసిన 3 ఎకరాలు చట్ట విరుద్ధమైన పత్రమని ఆయన అన్నారు. ఆ భూమి పై ఎలాంటి హక్కు లేని రామరావు దగ్గర నుంచి కొనుగోలు చేశారని, రిజిస్ట్రేషన్ చట్ట విరుద్ధమని ఆయన తెలిపారు. 1990లోనే 18 .35 ఎకరాలు మొత్తం సీలింగ్ మిగులు భూమిగా ప్రకటించారని తెలిపారు.

సర్వేనెం.130లో అసైన్‌దారులైన చాకలి యాదయ్య, చాకలి సత్తయ్య తండ్రి శివయ్య, చాకలి మాణయ్య, చాకలి లింగయ్య, చాకలి బిక్షపతి, చాకలి చంద్రయ్య, కత్తెర యాదయ్య, చాకలి పెద్ద వెంకయ్య, చాకలి చిన్నరాములు, యెరుకల లచ్చయ్య,దాసరి అంజయ్య నుంచి భూమిని అక్రమంగా కొనుగోలు చేసి తెల్లకాగిత లావాదేవీ ద్వారా అమ్మకానికి పెట్టినట్లు రికార్డులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ వెల్లడించారు. అచ్చంపేట్ సర్వే నెంబర్ 81 మొత్తం విస్తీర్ణం 16.91 ఎకరాలు మిగులు భూమిగా ప్రకటించారని, అనంతరం ఫోడీని తయారు చేసి భూమిలేని ఏడుగురు నిరుపేదలకు తహశీల్దార్ యెల్దుర్తి పంపిణి చేశారని తెలిపారు. సర్వేనెంబర్ 81లో కుయ్య బాలరాజ్, పెరికె రామవ్వ , కత్తెర పోచయ్య, మత్తడి సిద్దిరాములు, దుర్గం బిక్షపతి, జవ్వాజి నారాయణ, మత్తడి మాణిక్యం కు భూమి కేటాయింపు జరిగిందన్నారు. అసైనీలకు చెం దిన భూమిలో జమున హేచరీస్ ద్వారా ఫిల్లర్ స్ట్రక్చర్లు, రోడ్లు వేయడంతో సర్వేనంబరు 81లోని మొత్తం ప్రభుత్వ భూమి, అసైన్డ్ విస్తీర్ణం 14. 05 ఎకరాలు అక్రమంగా ఆక్రమించారని కలెక్టర్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News