Wednesday, April 24, 2024

కరోనాతో తీవ్రతరమైన పేదరికం

- Advertisement -
- Advertisement -

పేదరికం మనిషికి శాపం లాంటిది. ఆధునిక ప్రపంచంలో అవకాశాలను అందిపుచ్చుకోవటంలో సగటు జీవికి పేదరికం అడుగడుగునా అడ్డుపడుతోంది. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సామాజిక సమస్యలలో పేదరికం ఒకటి. ఇది అత్యంత తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన, మానవాళి మనుగడకే పెను సవాలు విసురుతుంది. ప్రపంచవ్యాప్తంగా పేదరికంలో మగ్గుతున్న వారి గొంతులు వినిపించి, పేదరిక నిర్మూలన కోసం కృషి చేయడానికి ఏటా ఐక్యరాజ్యసమితి అక్టోబర్ 17న అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సంవత్సరం ‘అందరం కలిసి మన భూగ్రహం పై ప్రజలందరినీ గౌరవిస్తూ.. శాశ్వత పేదరికాన్ని అంతం చేయడానికి ముందడుగు వేయాలనే ‘నినాదంతో ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. గత సంవత్సరంలో ప్రపంచాన్ని పట్టిపీడించిన COVID-19 మహమ్మారి ఫలితంగా 3 కోట్ల 70 లక్షల పైగా మరణాలు సంభవించాయి. ఈ సంక్షోభం పేదరికం మరియు తీవ్ర పేదరికానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాల దశాబ్దాల పురోగతిని తిప్పికొడుతోంది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం COVID-19 సంక్షోభం ఫలితంగా 7.1 నుండి 10 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి నెట్టబడ్డారని తెలిపింది. పేదరికం ఇప్పటికే ఎక్కువగా ఉన్న సహారాన్ దేశాల నందు 2021 లో 14.3 మరియు 16.3 కోట్ల మధ్య పెరుగుతుందని అంచనా వేయబడింది. వాస్తవానికి, COVID-19 ప్రభావం ప్రజలను కష్టాల్లోకి నెట్టింది. వస్తువులు, సేవలకు ప్రాప్యత, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, బలమైన సామాజిక రక్షణ, ఇది కష్టతరం చేస్తుంది. మహమ్మారి వ్యాప్తిని పరిమితం చేయడానికి విధించిన చర్యలు వారిని మరింత పేదరికంలోకి నెట్టాయి. పేదరికంలో ఉన్న చాలా మంది మనుగడ సాగించే అసంఘటిత ఆర్థిక వ్యవస్థ మూసివేయడం దీనికి కారణం. ఈ సమస్య కోట్లాది ప్రజలను కనీస అవసరాలకు దూరం చేస్తూ, పేదరికంలోకి నెట్టింది. పేదరికాన్ని 2030 నాటికి అంతం చేయాలనే ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో బాగంగా ప్రపంచ దేశాల కృషి కొంతమేర విజయం సాధించినప్పటికీ, కరోనా మరింత తీవ్రతరం చేసింది.
కరోనాతో పెరిగిన పేదరికం…
ప్రపంచంలోని చాలా దేశాలు పేదరిక సమస్యతో సతమతమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని పరిశీలిస్తే…. ఐక్యరాజ్య సమితి ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు లాంటి పది సూచికలతో బహుముఖ పేదరికాన్ని తాజాగా గణించడం జరిగింది. ఈ నివేదిక 75 దేశాలను అధ్యయనం చేయగా 65 దేశాల్లో 2000-2019 మధ్య పేదరికం తగ్గిందని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 2005-06 మరియు 2015-16 మధ్యకాలంలో బహుముఖ పేదరికం 27.3 కోట్లకు తగ్గిందని పేర్కొన్నది. భారతదేశంలో కూడా గత పదేళ్ల కాలంలో తీవ్రమైన పేదరికం నుంచి బయటపడ్డ వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని పేర్కొన్నడం సానుకూలాంశంగా చెప్పవచ్చు. కానీ, ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాతో పేదరిక నర్మూలన కార్యక్రమాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయోననే సంశయాని ఈ అధ్యయనం వ్యక్తం చేసింది. పది దేశాలలో ఇప్పటికే 70 శాతం మంది పిల్లలకు టీకాలు వేయని పరిస్థితి ఉంది. భారత్‌తో సహా బంగ్లాదేశ్ పాకిస్థాన్, నైజీరియా దేశాలలో 40 శాతం మందికి అత్యంత ముఖ్యమైన డి.టి.పి మూడు టీకాలు వేయలేని స్థితిలో ఉన్నాయని పేర్కొనడమే దీనికి నిదర్శనం. ఆధునిక కాలంలో ఎన్నడూ లేని విధంగా కొవిడ్-19 ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పేదలపై తీవ్ర ప్రభావం చూపిందని , 2021నాటికి ప్రపంచంలో 15 కోట్లమంది తీవ్ర పేదరికానికి గురయ్యే అవకాశముందని ప్రపంచబ్యాంక్ హెచ్చరించింది. కొత్త వ్యాపారాలు, కొత్త రంగాల్లో శ్రమ, నైపుణ్యాలు, ఆవిష్కరణలకు అవకాశాలు కల్పించాలని, కొవిడ్ తర్వాత “విభిన్నమైన ఆర్థిక వ్యవస్థ” కోసం దేశాలు సిద్ధం కావాలని కోరింది. కరోనా మహమ్మారి మహిళలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం, యూఎన్ అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) వెల్లడించింది. 2021 నాటికి దాదాపు 4.7కోట్ల మంది మహిళలు, బాలికలు తీవ్ర పేదరికంలోకి వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నడం ఆందోళన కలిగిస్తుంది.
పేదరికానికి గల కారణాలు…
కరోనా నియంత్రణకు ప్రభుత్వాలు చేపట్టిన చర్యలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో కరోనా కారణంగా చనిపోయే వారి సంఖ్యతో పోలిస్తే కొన్ని వందల రెట్లు అధికంగా పేదరికంలోకి తరలిపోతున్నారు. ఒక దేశంలో తక్కువ ఆదాయం, నిరుద్యోగం, అధిక జనాభా, వ్యవసాయం ప్రధానంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ, ఆర్ధిక అసమానతలు,వనరుల అల్ప వినియోగం, అల్ప వేతనాలు, పౌర భాగస్వామ్యం లోపం, సంక్షేమ పథకాల వైఫల్యం లాంటి అంశాలు ఇప్పటివరకు పేదరికానికి ప్రధాన కారణమని దారిద్య్రరేఖను నిర్వచించిన ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. వీటన్నింటిని తోడు ఇటీవల కరోనా సంక్షోభం పేదరికానికి తీవ్రంగా ఆజ్యం పోసిందని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా కరోనా నియంత్రణకు ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ ప్రక్రియతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. దీంతో విద్య, వైద్య, ఆరోగ్య, ఆదిత్యం, రవాణా, పర్యాటక తదితర రంగాలలో పనిచేస్తూన్న కోట్లాదిమంది ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా కుటుంబాల ఆర్థిక పరిస్థితి దిగజారింది. దాని ప్రభావం పెద్దలకంటే చిన్నారులు, పిల్లలపై మరింత తీవ్రంగా పడింది. లింగపరమైన అసమానతలకు దారి తీసింది. భారత్ లో మెజార్టీ మధ్యతరగతి కుటుంబాల్లో ఇంటిపెద్ద సంపాదనే కుటుంబ సభ్యులందరికీ ఆహార సముపార్జనకు సాధనం. ఆయనే ఉపాధి కోల్పోవడంతో పేదలతో పాటు మధ్య తరగతి కుటుంబాలు సైతం ప్రభుత్వ రేషన్‌తో కాలం గడిపే పరిస్థితి నెలకొంది. చాలా కుటుంబాలు ఆకలి, అర్ధాకలితో పోషకాహార లోపం, ఆరోగ్య సమస్యలతో రోడ్డున పడ్డారు. ఇది వారి ఆహార, ఆరోగ్య సంరక్షణపై తీవ్ర ప్రభావం చూపింది. మన దేశంలో వలస కార్మికుల సమస్యలు వర్ణనాతీతం అని చెప్పవచ్చు.
పేదరిక నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలు:
ప్రపంచాన్ని అభివృద్ధి పథంలో నడిపించటం కోసం మొదట చేయాల్సిన పని దారిద్య్రాన్ని నిర్మూలించటం. ప్రస్తుత కరోనా సంక్షోభంలో పేదరికం తగ్గాలంటే వృద్ధిరేటు పెంచడంతోపాటు నవ నూతన సంస్కరణలతో ముందుకు వెళ్లాలి. ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపర్చుకోవాలి. అభివృద్ధిని పరుగులు పెట్టించటంతో పాటు అన్ని వర్గాలకు సమానంగా అందే విధంగా కృషి చేయాలి. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతోపాటు సాధికారిక కార్యక్రమాలకు నాంది పలకాలి. ముఖ్యంగా ప్రజల జీవన ప్రమాణాల పెంపుకై వ్యవసాయం, సామాజిక రంగం, ఉపాధి కల్పన వంటి రంగాలపై పెద్ద ఎత్తున ఖర్చు చేయాలి. అందరికీ సమానంగా విద్య, వైద్య సౌకర్యాలు అందరికీ అందుబాటులో ఉండే వాతావరణం సృష్టించాలి. లింగ భేదం లేకుండా మహిళలకు ఆర్థిక రక్షణ కల్పించే ప్రత్యేక విధానాలను తీసుకురావాలని, వారికి ఆర్థిక స్వాలంభన కల్పించాలి. భారత్ వంటి దేశాల్లో వ్యవసాయానికి తగిన ప్రాధాన్యమివ్వటం తప్పనిసరి. ఈ రంగంలో సాధించే అభివృద్ధి వల్ల రెండింతలు పేదరికం తగ్గుతుందనే ఆర్థిక వేత్తల అంచనాలున్నాయి. ఇప్పటివరకు దేశంలో అమలు చేస్తున్న పేదరిక నిర్మూలన కార్యక్రమాలను పటిష్టంగా అమలు పరచాలి. ఆర్థిక పరిపుష్టికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘ఆత్మ నిర్భర భారత్ ‘ కార్యక్రమానికి వెంటనే నిధులు విడుదల చేయాలి. నైపుణ్యాల కల్పన, యువతకు విరివిగా ఉపాధి అవకాశాలు కల్పించటంపై ప్రభుత్వాలు దృష్టిసారించాలి. దానికై సాంకేతిక పరిజ్ఞానాన్ని కొత్త పుంతలు తొక్కించడంతో పాటు పరిశ్రమల స్థాపనకు పెట్టుబడి పెట్టాలి. పర్యావరణానికి హాని కలిగించని సుస్థిరాభివృద్ధి చర్యలకై ప్రతి ఒక్కరు ప్రతిన పూనాలి. ప్రపంచ దేశాలు ఆర్థికాభివృద్ధితో పాటు మానవాభివృద్ధి దిశగా సమగ్ర కార్యాచరణ రూపొందించాలి. పౌర సేవల వినియోగానికై ప్రతి ఒక్కరిని అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించే వికేంద్రీకృత ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయాలి. ఐరాసతో పాటు ప్రపంచ బ్యాంకు గ్రూపు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వంటివి పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు ఆయా దేశాలకు తోడ్పాటు అందించాలి. అప్పుడే నేటి సంక్షోభానికి చమరగీతం పాడడంతో పాటు పేదరికం అంతం అవుతుంది.

Global Poverty severe with corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News