Friday, March 29, 2024

అనుసంధానానికి ఓకే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నదుల అనుసంధాన ప్రక్రియకు తె లుగు రాష్ట్రాలు సూత్రప్రాయ అం గీకారం తెలిపాయి. సోమవారం హైదరాబాద్ జలసౌధలో జాతీయ జల అభివృద్ధి సంస్థ నదుల అనుసంధానంపై 17వ టాస్క్‌ఫోర్స్ స మావేశం నిర్వహించింది. ఎన్‌డ బ్లూడిఎ చైర్మన్ భోపాల్ సింగ్ అ ధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో భాగస్వామ్య రాష్ట్రాల అధికారులతో కేంద్ర జల వనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ కూడా పాల్గొన్నారు. దేశంలో ప్ర ధాన నదుల అనుసంధానంపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నదులు అనుసంధాన ప్ర క్రియపై లేవనెత్తిన పలు సందేహాలకు సమావేశంలో స్పష్టతనిచ్చా రు. తొలి కింద గోదావరికృష్ణాపెన్నాకావేరి నదుల అనుసంధానంపై ఈ సమావేశంలో ప్ర ధానంగా చర్చించారు.

గోదావరి నదిలో తెలంగాణ, ఆంధ్రపదేశ్ రాష్ట్రాలకు ఉన్న నీటి చుక్కా నీటిని కూడా నదుల అనుసంధానం ప్రాజెక్టు కోసం వినియోగించుకోబోమని ఎన్‌డబ్లూడిఎ నుంచి గట్టి హామీ లభించింది. చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి కేటాయించిన నీటిలో ఆ రాష్ట్రం అధిక శాతం నీటిని ఉపయోగించుకోలేకపోవడంతో ఆ నీరంతా వృథాగా పోతోందని సమావేశంలో ఎన్‌డబ్లూడిఎ చైర్మన్ బోపాల్‌సింగ్ వివరణ ఇచ్చారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉపయోగించుకోకుండా మిగిలిపోతున్న 141టిఎంసిలను మాత్రమే తొలిదశ కింద గోదావరికావేరి నదుల అనుసంధాన పథకంలో ఉపయోగించనున్నట్టు తెలిపారు.

గోదావరి నదిలో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన 980 టిఎంసిల నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పలు ప్రాజెక్టుల డిపిఆర్‌లకు కేంద్ర జల సంఘం నుంచి అనుమతి ఇప్పించాలని తెలంగాణ రాష్ట్రం కోరగా, అందుకు కేంద్ర జల వనరుల శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ సిడబ్లూసితో చర్చించి ప్రాజెక్టుల అనుమతులకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన కరువు ప్రాంతాలకు సాగునీటిని అందించటంలో ప్రాధాన్యత ఇవ్వాలని, నదుల అనుసంధానం ప్రాజెక్టులో వినియోగించే నీటిలో 50శాతం నీటిని తెలంగాణకు కేటాయించాలని కోరగా, ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

గోదావరి-కావేరి నదల అనుసంధానం కోసం ఇన్‌టేక్ పాయింట్ ఇచ్చంపల్లి వద్ద ఎంపిక చేస్తే ఎగువన మేడిగడ్డకు, దిగువన సమ్మక్క బ్యారేజీకి సమస్యలు వస్తాయన్న సందేహాలను కూడా తెలంగాణ ప్రభుత్వం సమావేశం ముందు పెట్టింది. సాంకేతికంగా సమగ్ర అధ్యయనం చేసిన తరువాతే, ఉన్న ప్రాజెక్టులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇన్‌టేక్ పాయింట్‌ను ఎంపిక చేస్తామని ఎన్‌డబ్లూడిఎ హామీ ఇచ్చింది.
పోలవరం నుంచి అనుసంధానం చేయండి: ఎపి
గోదావరి-కావేరి నదుల అనుసంధానం పోలవరం ప్రాజెక్టు నుంచి ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమావేశం దృష్టికి తెచ్చింది. పోలవరం కుడి కాలువ నుంచి నీటిని మళ్లిస్తే నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి , అటు నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసే ప్రతిపాదనను కూడా ఎన్‌డబ్లూడిఎ ముందు పెట్టింది. ఈ ప్రతిపాదనలను కూడా పరిశీలన చేస్తామని సలహాదారు వెదిరేశ్రీరామ్ వెల్లడించారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్ర పరిధిలోని 141 టిఎంసిల మిగులు జలాలను ఉపయోగించుకోవచ్చని ఆ రాష్ట్రం నుంచి పూర్తి అంగీకారం లభించాకే గోదావరికావేరి నదుల అనుసంధానం చేపట్టాలని ఎపి వెల్లడించింది.
నీటి కేటాయింపుల్లో రీ అలకేషన్స్
గోదావరి-కావేరి నదుల అనుసంధానం ద్వారా వినియోగించుకునే నీటిలో ఆయా రాష్ట్రాలకు రీ అలకేషన్స్ చేయాలన్న ప్రతిపాదనలకు సమావేశంలో సానుకూలత వ్యక్తమైంది. బేసిన్ పరిధిలో ఉన్న రాష్ట్రాలకే రీ అలకేషన్‌లో ప్రథమ ప్రాధాన్యం ఇచ్చేందకు ఎన్‌డబ్లూడిఎ సుముఖత తెలిపింది. ఒక్కో రాష్ట్రానికి వన్‌బైథర్డ్ దామషాగా కేటాయింపులు జరిపే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.
రూ.43వేలకోట్ల అంచనాతో అనుసంధానం
గోదావరికావేరి నదుల అనుసంధానం తొలిదశ పథకానికి రూ.43వేలకోట్లు వ్యయం అవుతుందని ప్రాధమిక అంచనా వేసినట్టు ఎన్‌డబ్లూడిఎ వెల్లడించింది. ఈ నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 90శాతం భరిస్తుందని 10శాతం ఆయా రాష్ట్రాలు భరించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ సమావేశంలో రాజస్థాన్ , మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఉపయోగపడే పర్బతిచంబల్ నదుల అనుసంధానంపై కూడా చర్చించారు. వీటికి సంబంధించిన డిపిఆర్ ప్రతులను ఆయా రా్రష్ట్రాలకు అందజేసి టాస్క్‌ఫోర్స్ సమావేశంలో అభిప్రాయాలు సేకరించారు. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి ఇఎన్‌సి మురళీధర్, ఎపి నుంచి ఇఎన్‌సి నారాయణరెడ్డితో పాటు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రా్రష్ట్రాల అధికారులు పాల్గొన్నారు.
ఇక నుంచి డ్రిప్ ప్రాజెక్టులకే కేంద్రం అనుమతి
సాగునీటి ప్రాజెక్టులను నిర్మించుకునేందుకు ఇక నుంచి తక్కువ నీటి వినియోగంతో ఎక్కవ పంటలు పండించుకునేలా డ్రిప్, స్పింక్లర్ వంటి విధానాలు అమలుచేసే వాటికే అనుమతి ఇచ్చేలా కేంద్ర జల సంఘం విధానాల్లో మార్పులు తెస్తున్నట్టు సలహాదారు వెదిరె శ్రీరామ్ తెలిపారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. గోదావరి నదిలో మిగుల జలాలే లేవని కేంద్ర జలసంఘం అధ్యయనం ద్వారా తేల్చిందన్నారు. కాని ఏటా వేల టిఎంసిల గోదావరి నదీ జలాలు సముద్రంలో కలుస్తున్నాయని తెలిపారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి నదుల అనుసంధానం కోసం 141 టిఎంసిల నీటిని వినియోగించనున్నందున ఆ రా్రష్ట్రం నష్టపోకుండా ప్రత్యామ్నాయంగా లాభం చేకూరే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చత్తీసగఢ్ ప్రభుత్వంతో ప్రత్యేకంగా చర్చలు జరపనున్నట్టు తెలిపారు.

ఆ రాష్ట్రానికి నగదు ప్యాకేజీ లేదా కోరిన విధంగా విద్యుత్ కేటాయింపులు లేదా మరో విధంగా కేంద్రం ఆ రాష్ట్రానికి సాయం చేసే అవకాశాలు ఉన్నట్టు తెలిపారు. జాతీయ ప్రాజెక్టులకు కేంద్రం 60శాతం, రాష్ట్రం 40శాతం నిధులు భరించేవిధంగా విధానాలు ఉన్నట్టు తెలిపారు. నేషనల్ రివర్ లింకింగ్ అథారిటీలను ఏర్పాటు చేస్తామని, అందులో అన్ని రాష్ట్రాల సభ్యులు ఉంటారని తెలిపారు. రెండో దశలో మహానదిగోదావరి నదుల అనుసంధానం ద్వారా 240 టిఎంసిల నీరు లభించే అవకాశాలు ఉన్నట్టు తెలిపారు. గోదావరికావేరి అనుసంధానంలో ఇచ్చంపల్లికి బదులు సమ్మక్క బ్యారేజీని ఇన్‌టేక్ సోర్స్‌గా ఉపయోగించుకునే అంశాన్ని కూడా పరిశీలన చేస్తామన్నారు. నదుల అనుసంధానం ప్రక్రియ సానుకూల వాతావరణంలో జరిగిందని ఎన్‌డబ్ల్యూడిఎ చైర్మన్ భోపాల్‌సింగ్ స్పష్టం చేశారు. సమక్క ఆనకట్టను రివర్ లింక్ సోర్సుగా ఉపయోగించుకోవాలని కోరినట్టు ఇఎన్‌సి మురళీధర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News