హైదరాబాద్ : వీసా, విదేశాల్లో ఉద్యోగం కొరకు, షాపులలో బిల్లులు చెల్లించుటకు క్యూలో నిలబడతామని, అదే మాదిరి ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ఓటింగ్ డే ను డెమోక్రసీ డే గా జరుపుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. రవీంద్రభారతిలో జరిగిన 10వ జాతీయ ఓటరు దినోత్సవం వేడుకలలో ముఖ్య అతిధిగా గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేతివేలి మీద ఉండే సిరా గుర్తును చూసుకొని గర్వపడాలని ఓటర్లకు సూచించారు.
దేశంలో అత్యంత శక్తిమంతులు ఓటర్లేనని పేర్కొన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల గుణాలను బేరీజు వేసుకొని ఓటు వేయాలని కోరారు. విద్యావంతులున్న పట్టణ ప్రాంతాలలో పోలింగ్ శాతం తక్కువగా ఉంటుందని, ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం అనేక మార్పులు తీసుకువస్తున్నదని వివరించారు. ఇటీవల కొంపల్లిలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నేషన్ పరిజ్ఞానాన్నిప్రవేశపెట్టినట్లు తెలిపారు. మోడల్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల రద్దీ ఎక్కువగా ఉన్నదని తెలిపారు.
మత, భాష, ప్రాంతం, కులం, వర్గంకు అతీతంగా ఓటు వేసి ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తామని ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు. రాష్ర్ట ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాన్ని భగువంతుని సూచనగా భావిస్తామని పేర్కొన్నారు. మన ఎన్నికల వ్యవస్థ పట్ల గర్వపడాలని పేర్కొన్నారు. అభివృద్ది చెందిన, చెందుతున్న వర్థమాన దేశాల్లో రాజకీయ సుస్థిరత లోపించినప్పటికీ, మన దగ్గర ప్రజల అభిప్రాయాల మేరకే ప్రభుత్వాల మార్పు జరిగినట్లు తెలిపారు.
సమర్థవంతంగా.. పారర్శకంగా : రజత్కుమార్
ప్రధాన ఎన్నికల అధికారి డా.రజత్ కుమార్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరికి ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వాములను చేసేందుకు ఎన్నికల సంఘం కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా దివ్యాంగుల ఓటరు నమోదుకు గత రెండు సంవత్సరాలుగా చేస్తున్న కృషి మంచి ఫలితాలను ఇస్తున్నట్లు తెలిపారు. ప్రశాంతంగా పార్లమెంట్, శాసన సభ, స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించుకున్నామని వివరించారు. ఎన్నికల నిర్వహణలో గత సంవత్సరం రాష్ర్టపతి నుండి ఒక జాతీయ అవార్డును పొందినట్లు తెలిపారు. ఈ రోజు జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా రాష్ర్టపతి నుండి రెండు జాతీయ అవార్డులు లభించినట్లు తెలిపారు.
లా అండ్ ఆర్డర్లో హైదరాబాద్ సిటీ పోలిస్ కమిషనర్ అంజనీకుమార్, వినూత్న పద్దతులను అమలు చేసిన జగిత్యాల కలెక్టర్ ఎ.శరత్ ఈ జాతీయ అవార్డులు అందుకున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఎన్నికల ప్రక్రియలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, బి.ఎల్.ఓలు, ఇతర సిబ్బందికి, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు విజేతలకు గవర్నర్ అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్కుమార్ పాల్గొన్నారు.