Friday, April 19, 2024

పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్

- Advertisement -
- Advertisement -

Govt agrees to transfer of mutual employees in Telangana

ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

భార్యాభర్తల కేసులను తక్షణమే పరిష్కరించాలి
అధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశం, నేడు లేదా రేపు ఉత్తర్వులు వచ్చే అవకాశం

మనతెలంగాణ/హైదరాబాద్ : ఉద్యోగుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పరస్పర ఉద్యోగుల బదిలీకి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఉద్యోగులిద్దరూ పరస్పరం అవగాహనకు వస్తే వారిని బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల విజ్ఞప్తులన్నింటినీ పరిశీలించాలని సిఎస్ సోమేష్‌కుమార్‌కు బుధవారం సాయంత్రం సిఎం కెసిఆర్ సూచించినట్టుగా తెలిసింది. భార్యాభర్తల కేసులను తక్షణం పరిష్కరించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే బదిలీలపై రేపు లేదా ఎల్లుండి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.

ఇదిలావుండగా, బిఆర్‌ఆర్‌కె భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను టిఎన్జీఓ నాయకులు బుధవారం కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల జోనల్ విభజనలో పరస్పర బదిలీలకు, భార్యాభర్తల కేసులకు అవకాశం ఇచ్చి బదిలీలు చేపట్టాలని సిఎస్‌కు టిఎన్జీఓ నాయకులు విజ్ఞప్తి చేశారు. జీఓను అనుసరించి లోకల్ క్యాడర్ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఉద్యోగులకు పరస్పర బదిలీలకు, 317 భార్యాభర్తల కేసులకు, ఆప్షన్ల ప్రక్రియలో సీనియర్, జూనియర్లకు మధ్య జరిగిన పొరపాట్లను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని టిఎన్జీఓ కేంద్ర సంఘ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్‌హుస్సేనీ తదితరులు కలిసి విజ్ఞప్తి చేశారు.

ఉద్యోగుల విభజనకు సంబంధించి టిఎన్జీఓలు తమ దృష్టికి తీసుకొచ్చిన విషయాలను సిఎం కెసిఆర్‌కు నివేదిస్తానని సిఎస్ సోమేశ్ కుమార్ యూనియన్ నాయకులతో తెలిపారు. స్పౌస్ కేసులు, మ్యూచువల్ కేసులతో పాటు అప్పీల్స్‌ను పరిష్కరించడం లాంటి అంశాలను సిఎం దృష్టికి తీసుకెళ్లి వాటిని త్వరితగతిన పరిష్కరిస్తానని సిఎస్ సోమేష్‌కుమార్ టిఎన్జీఓ నాయకులకు హామీ ఇచ్చారు. సిఎస్‌ను కలిసిన వారిలో నల్లగొండ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, కోశాధికారి రామినేని శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News