మోదీ ప్రభుత్వానికి పిహెచ్ఎఫ్ఐ సూచన
న్యూఢిల్లీ : కరోనా నుంచి తగినంతమంది కోలుకుంటున్నారని పదేపదే ప్రకటిస్తూ ఆశలు కలిగించడమే కాకుండా మరణాల సంఖ్యను నియంత్రించడానికి మోడీ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలని పబ్లిక్హెల్తు ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పిహెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు కె. శ్రీనాధరెడ్డి సూచించారు. ఈ నెల 27 నాటికి భారత్లో రికవరీ 58 శాతం వరకు ఉందని, దీన్నే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పదేపదే ప్రకటిస్తూ భ్రమలు కల్పిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ సహకారంతో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి 2006లో ఈ సంస్థ ఏర్పాటైంది. శిక్షణ, పరిశోధన లక్షంగా పనిచేస్తోంది. ఆస్పత్రుల్లోను, ఆస్పత్రుల బయట ఎంతమంది మృతి చెందారో కచ్చితంగా సమీక్షించాలని ఆయన సూచించారు. చివరకు 95 శాతం రోగులు కోలుకుంటారని భావిస్తున్నట్టు చెప్పారు. భారత్ కన్నా ముందే కరోనా కేసులు ఎక్కువగా ఉండే దేశాలు మనకన్నా రికవరీ శాతం ఎక్కువగా వెల్లడించాయని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా డెన్మార్క్లో 95శాతం, ఇటలీలో 84 శాతం, ఫ్రాన్స్లో 72 శాతం రికవరీ రేటు ఉన్నట్టు ప్రకటించారని ఆయన ప్రస్తావించారు.