మనతెలంగాణ/హైదరాబాద్: బాపూఘాట్ను అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖమంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. రాష్ట్ర మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సూచనల మేరకు గురువారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ బాపూ ఘాట్ పరిసరాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా, విదేశీ ప్రతినిధులు బాపూఘాట్ను సందర్శించే విధంగా తీర్చిదిద్దేందుకు అధికారులతో ఆయన సమావేశమయ్యారు. బాపూఘాట్లో ఉన్న పురాతన బావి, ధ్యానకేంద్రం, ల్యాండ్ స్కేపింగ్, గార్డెనింగ్, పుట్పాత్ల అభివృద్ధి, ఓపెన్ ఆడిటోరియంలను అభివృద్ధి చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు. బాపూఘట్కు ఆనుకుని ఉన్న దహన వాటిక ఘాట్లను మూసీనదీ కాలువ మరోవైపు తరలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. దహన వాటికను మూసీకి మరోవైపు తరలించడంతో పాటు అనేక సౌకర్యాలతో తీర్చిదిద్దాలని అధికారులతో చెప్పారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండి మనోహర్, హెచ్ఎండిఏ అధికారులు, జిహెచ్ఎంసి ప్లానర్ దేవేందర్ రెడ్డి, జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ ప్రావీణ్య, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Govt to develop Bapu ghat international level:srinivas goud