Thursday, March 28, 2024

పెళ్లి ఇంట్లో విషాదం..

- Advertisement -
- Advertisement -

ఉట్నూర్: మర్నాడు కుటుంబంలో పెళ్లి జరిగి ఆనందాలతో ఉండే సమయంలో వరుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో చోటుచేసుకుంది. దీంతో పెళ్లి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్నూర్ పట్టణంలోని అంగడిబజార్ ప్రాంతంలో రావుల శంకరయ్య, భూలక్ష్మి దంపతుల కుమారుడు రావుల సత్యనారాయణ (34)కు మేట్‌పెళ్లికి చెందిన యువతితో శుక్రవారం పెళ్లి జరగనుంది. పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కుటుంబ సభ్యులతో పాటు వరుడు పెళ్లి పనులు చూసుకొని బుధవారం రాత్రి భోజనం చేసి నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయంలో మంచంపై నుంచి వరుడు కిందపడి వాంతులు చేసుకున్నాడు. చాతిలో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పాడు. కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు అదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తెల్లవారితే బాజాభజంత్రీలు మొగాల్సిన ఇంట్లో పెళ్లి కుమారుడు హఠాన్మరణం చెందడం పట్ల ఇరు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి.

అందరితో కలిసి మెలసిగా ఉండే మృతుడు అకస్మాత్తుగా మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు, సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపి రాథోడ్ రమేష్ గురువారం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News