పార్టీని బలోపేతం చేయడం కోసమే : గ్రూప్ ఆఫ్ 23 నేతలు, ఆజాద్ సేవల్ని ఉపయోగించుకోవాలన్న కపిల్ సిబల్
జమ్ము : కాంగ్రెస్ను పునరుత్తేజితం చేయడానికి సంస్కరణలు అవసరమంటూ గళమెత్తిన ‘గ్రూప్ ఆఫ్ 23’గా పేరున్న సీనియర్లు మరోసారి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శనివారం గులాంనబీ ఆజాద్ నేతృత్వంలో జమ్మూలో శాంతి సమ్మేళన్ పేరుతో సమావేశమై తమ భవిష్యత్ వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా సీనియర్లలో ఒకరైన రాజ్బబ్బర్ మాట్లాడుతూ ‘అందరూ మమ్మల్ని జి23 అంటున్నారు. మేం గాంధీ 23. మహాత్మాగాంధీ ఆలోచలనకు అనుగుణంగానే ఈ దేశంలోని చట్టా లు, రాజ్యాంగం రూపొందాయి. కాంగ్రెస్ ఆ ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లేందుకు దృఢంగా కట్టుబడి ఉంది. జి23 కోరేది కాంగ్రెస్ బలం గా ఉండాలన్నదే’ అన్నారు.
జి 23లోని సీనియర్ నేతలైన ఆనంద్శర్మ, హర్యానా మాజీ సిఎం భూపీందర్సింగ్, కపిల్సిబల్, వివేక్తంఖా, ఆజాద్ కూడా ఈ సందర్భంగా గళం విప్పారు. కాంగ్రెస్ బలహీనపడటం వాస్తవం, మేం ఇప్పుడు సమావేశమైంది, గతంలో అయింది కూడా పార్టీని బలోపేతం చేయడానికేనని సిబల్ అన్నారు. ఆజాద్ అనుభవజ్ఞుడైన నేత. ఆయన విమానాన్ని నడపగలరు. ఇంజిన్లో సమస్య ఏర్పడితే, ఆయనకు సహాయకారిగా ఇంజినీర్ అవసరం. అనుభవజ్ఞుడైన ఇంజినీర్లాంటివారే ఆజాద్ అంటూ సిబల్ కొనియాడారు. ఆజాద్ పార్లమెంట్ నుంచి బయటకు వస్తున్నారని తెలిసి మేమంతా ఎంతో బాధ పడ్డాం. అనుభవజ్ఞుడైన ఆయణ్ని కాంగ్రెస్ ఎందుకు ఉపయోగించుకోలేకపోతోందని సిబల్ అన్నారు. చివరిగా ఆజాద్ మాట్లాడుతూ.. తమ పార్టీ అన్ని మతాలు, కులాల్ని గౌరవిస్తుందన్నారు. అందరినీ సమానంగా గౌరవించడమే తమ బలమన్నారు.