Friday, March 29, 2024

మువ్వన్నెల ప్రగతి

- Advertisement -
- Advertisement -

Growth in Agriculture Service and Industrial sectors

 

సాగు, సేవ, పారిశ్రామిక రంగాల్లో విశేష వృద్ధి రేటును సాధించిన రాష్ట్రం

సేవారంగంలో దేశంలోనే తొలిస్థానం.. మూలధన వ్యయంలోనూ టాప్
వ్యవసాయ రంగంలో 10 శాతానికి వృద్ధిరేటు ?
వంద శాతంకు పైగా పెరిగిన ఐటి ఎగుమతులు

హైదరాబాద్: వ్యవసాయం, సేవా, పారిశ్రామిక రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం అంతకంతకు పురోగతిని సాధిస్తోంది. ముఖ్యంగా సేవా రంగం వృద్ధిలో దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కంటే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఆర్థిక సర్వే ప్రకారం, 2014-15 నుండి 2018-19 వరకు ఐదేళ్ల కాలంలో, రాష్ట్రంలో సేవల రంగం యొక్క వార్షిక వృద్ధి 11.5 శాతంగా ఉంది. ఇక 10.5 శాతంతో కర్ణాటక రెండవ స్థానంలో నిలిచింది. ఇక 2018-19లో స్థూల రాష్ట్ర విలువ ఆధారిత (జిఎస్‌విఎ)లో తెలంగాణ సేవల రంగం వాటా 64.7 శాతంగా ఉంది, దీంట్లో రాష్ట్రం ఆరో స్థానంలో ఉంది. గడిచిన ఐదు సంవత్సరాలలో మెరుగుపడుతూ సేవల రంగ వృద్ధి 11.5 శాతంగా ఉంది. వృద్ధి, స్థూల ఆర్థిక స్థిరత్వం ప్రయోజనాలు క్షేత్రస్థాయిలో చేరడంలో ముఖ్యంగా సేవల రంగంలో చేరేలా రాష్ట్ర ప్రభుత్వం పనితీరు బాగుందని ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు.

అలాగే రాష్ట్రాభివృద్ధి కోసం, ఆస్తుల కల్పన కోసం వెచ్చించే మూలధన వ్యయంలోనూ దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 16.9 శాతం మూలధన వ్యయంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో నిలిచింది. నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, పరిశ్రమలు వంటి వాటికోసం ఖర్చు చేసేది మూలధన వ్యయంలోకి వస్తుంది. ఇక రాష్ట్ర ఏర్పాటుకు ముందు రెండు సంవత్సరాలలో, స్థిర ధరల వద్ద రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జిఎస్‌డిపి) సగటు వృద్ధిరేటు కేవలం 4.2 శాతం ఉండేది.

2018-19 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర జి.ఎస్.డి.పి. వృద్ధిరేటు రెండున్నర రెట్లకు పైగా పెరిగి 10.5 శాతంగా నమోదైందన్నారు. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర సంపద విలువ రూ.8,65,688 కోట్లుగా నమోదు కాగా ఇప్పుడు ఇది రూ.10 లక్షల కోట్లకు చేరుతోంది. సమైక్య పాలన చివరి పది సంవత్సరాలలో మూలధన వ్యయం కింద తెలంగాణ ప్రాంతంలో రూ.54,052 కోట్లు ఖర్చు పెడితే, రాష్ట్రం ఏర్పడిన కేవలం ఐదేళ్లలోనే రూ.1,03,551 కోట్ల ప్రభుత్వం ప్రజోపయోగ కార్యక్రమాల కోసం వెచ్చించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నిధులు కలిపితే ఈ మొత్తం పెరుగుతుంది. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన మొత్తం మూలధన వ్యయం రూ. 1,65,167 కోట్లుగా ఉంది. సమైక్య రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం సగటున ఏడాదికి ఐదు వేల నాలుగు వందల కోట్లు రూపాయాలు ఖర్చు చేస్తే, రాష్ట్రంలో ఏడాదికి సగటున రూ.33,833 కోట్లు పభుత్వం ఖర్చు చేస్తోంది.

ఐటి ఎగుమతులు 17 శాతం అధికం
2014-15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో రాష్ట్రంలో ఐటి ఎగుమతుల విలువ రూ. 52 వేల కోట్లు ఉంటే 2018-19 ఆర్థిక సంవత్సరం నాటికి వంద శాతానికి పైగా పెరిగి,రూ.1.10 లక్షల కోట్లు దాటింది. ఐటీ ఎగుమతుల విషయంలో జాతీయ సగటు తొమ్మిది శాతంతో పోలిస్తే తెలంగాణ ఐటి ఎగుమతులు 17 శాతం అధికంగా ఉండటం విశేషం. ఇక వ్యవసాయం, దాని అనుబంధ శాఖలతో కూడిన ప్రాథమిక రంగంలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో 1.8 శాతం వృద్ధిరేటు మాత్రమే తెలంగాణలో నమోదైంది.

గడిచిన ఐదేళ్లలో 6.3 శాతం అదనపు వృద్ధి సాధించి, 2018-19 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి తెలంగాణ వ్యవసాయ రంగంలో 8.1 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి 10 శాతం వృద్ధిరేటుకు చేరువవుతుందని అంచనా వేస్తున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 0.4 శాతం వృద్ధిరేటుతో ఉన్న పారిశ్రామిక రంగంలో కూడా అదనంగా 5.4 శాతం అదనపు వృద్ధి సాధించి, 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 5.8 శాతం వృద్ధిని తెలంగాణ రాష్ట్రం నమోదు చేసింది. ఈసారి 7 శాతం వరకు ఉంటుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది.

Growth in Agriculture Service and Industrial sectors
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News