న్యూఢిల్లీ: ఎనిమిది నెలల తర్వాత వస్తు సేవల పన్ను (జిఎస్టి) వసూళ్లు లక్ష కోట్లను దాటాయి. అక్టోబర్ నెలలో ఈ వసూళ్లు 1,05,155 కోట్లకు చేరుకున్నాయి. ఫిబ్రవరి తర్వాత జిఎస్టి వసూళ్లు లక్ష కోట్లను దాటడం ఇదే మొదటిసారి. ఇందులో సిజిఎస్టి వాటా రూ.19,193 కోట్లు కాగా, ఎస్జిఎస్టి రూ.25,411 కోట్లు, ఐజిఎస్టి రూ. 52,540 కోట్లు, సమ్మిళిత జిఎస్టినుంచి కేంద్ర వాటా రూ.25,091 కోట్లు, రాష్ట్రాల వాటా 19,427కోట్లుగా ఉండనుంది. ఫలితంగా కేంద్రానికి రూ.45,285కోట్లు, రాష్ట్రాలకు రూ.44,839 కోట్లు లభించనున్నాయి. గత ఏడాది అక్టోబర్లో వసూలైన రూ.95,379 లక్షల కోట్లతో పోలిస్తే ఈ సారి 10 శాతం ఎక్కువ వసూలయ్యాయి. గత నెలలో 80 లక్షల రిటర్న్లు దాఖలయ్యాయి. లాక్డౌన్ ప్రభావంతో మార్చినుండి పడిపోయిన జిఎస్టి వసూళ్లు సడలింపుల తర్వాత క్రమంగా పెరుగుతుండడం గమనార్హం.
జులైలో రూ.87,422 కోట్లు, ఆగస్టులో రూ.86,449 కోట్లు, సెప్టెంబర్లో రూ.95,480కోట్లు వసూలయ్యాయి. తాజాగా వసూళ్లు లక్ష కోట్లను దాటడం ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి నిదర్శనంగా నిలుస్తోందని నిపుణులు అంటున్నారు. ఇక ఎపినుంచి రూ.2480 కోట్లు, తెలంగాణనుంచి రూ.3383 కోట్లు జిఎస్టి వసూలైంది. గత ఏడాదితో పోలిస్తే ఎపిలో 28 శాతం వృద్ధి రేటు నమోదు కాగా, తెలంగాణలో 5 శాతం నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
GST Collections cross 1 lakh crore in October