హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజలను అగౌరవించే విధంగా దేశప్రధాని మాట్లాడారని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హితవు చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా 3 కోట్ల తెలంగాణ ప్రజలను ప్రధాని మోడీ హేళన చేశారని ఆయన నిందించారు. శుక్రవారం తన క్యాంపుకార్యాలయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ వ్యాఖ్యానాలను తప్పుబట్టారు. తెలంగాణ ఉద్యమకాలంలో బిజెపి ఒకతీరు, అధికారంలోకి రాగానే మరోతీగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకాలంలో పార్లమెంట్ ప్రతిపక్షనాయకురాలు సుస్మాస్వరాజ్ మద్దతుతో తెలంగాణ ఆవిర్భావం సాధ్యమైందని ఆయన గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ప్రధాని మాట్లాడుతున్న మాటలను వింటుంటే సుస్మాస్వరాజ్ను కూడా కించపర్చేవిధంగా ఉన్నాయన్నారు.
ప్రధాన మంత్రి హోదాలో ఉండి తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన రాజకీయపార్టీలను హేళనచేసేవిధంగా మాట్లాడటం విచారకరమన్నారు. మోడీ కొన్నిరాష్ట్రాలకు మాత్రమే ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారని గుత్తా ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా మోడీ ప్రధానమంత్రి అనేవిషయం ఆయనే మర్చిపోతే ఎలాని గుత్తా ప్రశ్నించారు. రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో ప్రధాని నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలాగే సంక్షేమపథకాలకు నిధులు కూడా మంజూరు చేయడంలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు.
ఎలాంటి సహాయం అందించని మోడీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని భంగపరుస్తూ వ్యాఖ్యానించడం శోఛనీయమన్నారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి వాస్తవాలను తెలుసుకుని భవిష్యత్లో తెలంగాణప్రజలను,తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించేవిధంగా మాట్లాడాలని హితవుచెప్పారు. ఎన్నోపౌరాటాలు, మరెన్నో ఉద్యామాలతో సాధించిన తెలంగాణను కించపర్చడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ఆయన వాస్తవాలను గ్రహించి తెలంగాణ అభివృద్ధికోసం తనవంతు సహాయం అందించాలని గుత్తా డిమాండ్ చేశారు.