హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పిహెచ్ఎల్) తొలి సీజన్ను మార్చి ఐదున తెరలేవనుంది. ఈ విషయాన్ని పిహెచ్ఎల్ చైర్మన్, భారత హ్యాండ్బాల్ సమాఖ్య ఉపాధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహన్ రావు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇక, లీగ్ను పురస్కరించుకుని కాన్పూర్ నగరంలో ఆటగాళ్ల వేలం పాట జరిగింది. అట్లహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయా ఫ్రాంచైజీల యాజమాన్యాలు ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. కాగా, జైపూర్ వేదికగా జరిగే తొలి పిహెచ్ఎల్ సీజన్లో పాల్గొంటున్న జట్ల వివరాలను కూడా ఈ సందర్భంగా జగన్మోహన్రావు ప్రకటించారు. తెలంగాణ టైగర్స్, ధాకడ్ ఢిల్లీ, బెంగాల్ బ్లూస్, రెడ్ హాక్స్ రాజస్థాన్, యూపి ఐకాన్స్, తమిళ్ విరాన్స్ జట్లు ఈ లీగ్లో తలపడనున్నాయి. ఇక, ప్రతి జట్టులో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు, ఇద్దరు స్వరాష్ట్ర క్రీడాకారులతో పాటు మొత్తం 12 మంది ఆటగాళ్లు ఉంటారు.
మరోవైపు ఆటగాళ్ల వేలం పాటలో ఆయా జట్ల యాజమాన్యులు తమతమ అభిమాన ఆటగాళ్లను కొనుగోలు చేశారు. ఇదిలావుండగా ప్రతి జట్టులో ఒక ప్రధాన్ కోచ్తో పాటు ఇద్దరు సహాయక సిబ్బందిని ఆయా ఫ్రాంచైజీలు నియమించుకున్నాయి. మార్చి ఐదు నుంచి 23 వరకు ఈ లీగ్ జరుగనుంది. కాగా, ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తేవాలనే ఉద్దేశంతో ఈ లీగ్ను ఏర్పాటు చేయడం జరిగిందని, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రావు కృతజ్ఞతలు తెలిపారు. అందివచ్చిన అవకాశాన్ని ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోవాలని జగన్మోహన్ రావు సూచించారు. లీగ్ వేలం పాటలో భారత హ్యాండ్బాల్ సమాఖ్య అధ్యక్షుడు రామ సుబ్మహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి ఆనందేశ్వర్ పాండేతో పాటు ఆయా ఫ్రాంచైజీల యాజమానులు తదితరులు పాల్గొన్నారు.