అరెస్టు చేసిన రాచకొండ సైబర్ క్రైం పోలీసులు
మనతెలంగాణ, హైదరాబాద్ : ట్యాబ్ను రిపేర్కు ఇచ్చిన మహిళ ఫొటోలను సేకరించి ఫేస్బుక్లో నకిలీ ప్రొఫైల్ సృష్టించి వేధింపులకు గురిచేస్తున్న నిందితుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్, ట్యాబ్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… హైదరాబాద్, దిల్సుఖ్నగర్, వికాస్నగర్కు చెందిన అశోక్ పటేల్ అలియాస్ అశ్విన్ పటేల్ నిరుద్యోగి, కొద్ది కాలం జగదీష్ మార్కెట్లో మొబైల్ రిపేర్ సెంటర్ ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో బాధితురాలు మార్చి, 2020లో తన ట్యాబ్ రిపేరుకు రావడంతో మరమ్మత్తు కోసం నిందితుడి షాపులో ఇచ్చింది. ట్యాబ్ రిపేర్ చేసి రెండు రోజుల్లో ఇస్తానని చెప్పాడు.
ట్యాబ్కు స్క్రీన్ వేసిన నిందితుడు దానిలో నుంచి మహిళకు సంబంధించిన ఫొటోలు సేకరించాడు. ఫేస్బుక్ నకిలీ ఖాతాను ఆమె పేరుతో ఓపెన్ చేసి బాధితురాలి ఫొటోలను ప్రొఫైల్ ఫొటోగా పెట్టాడు. దాని ద్వారా పలువురికి రిక్వెస్ట్లు పంపించాడు. కొద్ది రోజుల తర్వాత అశోక్ పటేల్ షాపును మూసివేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. బాధితురాలి ట్యాబ్ను కూడా తిరిగి ఇవ్వలేదు. విషయం తెలుసుకున్న బాధితురాలు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, ఎసిపి హరినాథ్ పర్యవేక్షణలో ఇన్స్స్పెక్టర్ వెంకటేష్ దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.