Saturday, April 20, 2024

దాని కోసం 25 వేల కోట్ల రూపాయలు ఆశ చూపింది: హరీష్ రావు

- Advertisement -
Harish fire on Modi Government
సిద్దిపేట: ఎదిగిన కొద్ది ఒదిగి ఉండే మనస్తత్వం మాదాసు శ్రీనివాసుదని, సిఎం కెసిఆర్ కూడా మాదాసు శ్రీనివాస్ కు పదవి ఇస్తే బాగుంటదనే అభిప్రాయం వ్యక్తం చేశారని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.  సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, ఒంటేరు ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఈ మేరకు తెలంగాణ విద్యార్థి, ఉద్యమ నాయకుడైన మాదాసు శ్రీనివాస్ గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు కార్యవర్గ సభ్యులు మంత్రి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. 2001 నుంచి ఇప్పటి వరకూ అటు ఉద్యమంలో ఇటు పార్టీలో కష్టపడి పని చేసే వ్యక్తి శ్రీనివాస్ అని ప్రశంసించారు. బిజెపి నాయకులు ఏం ముఖం పెట్టుకుని సిద్దిపేట, గజ్వేల్ లో తిరుగుతున్నారని మంత్రి ధ్వజమెత్తారు. ఉపాధిహామీని వ్యవసాయానికి అనుబంధం చేయాలని, ఇప్పటికే మూడుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపామని, ఆ పని చేసుకొచ్చి ముఖం చూపిస్తే బాగుంటుందని ప్రతిపక్షాలకు చురకలంటించారు.
బావుల దగ్గర మోటార్లకు మీటర్లు పెడితే 25 వేల కోట్లు ఇస్తామని కేంద్రం ఆశ చూపిందని, కానీ సిఎం కెసిఆర్ బావుల  మోటార్లకు మీటర్లు పెట్టేదే లేదన్నారు. రైతులకు కష్టం తెచ్చే ఏ పని కూడా చేయనని కరాఖండిగా తేల్చి చెప్పారని మంత్రి హరీశ్ గుర్తు చేశారు. ఎఫ్ సిఐతో బియ్యం కొనకుండా రైసుమిల్లులపై దాడులు చేసి కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు.
మోడీ ప్రభుత్వం ఓర్వలేక తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన ఎఫ్ఆర్ బిఎం నిధులను కావాలనే కేంద్ర ప్రభుత్వం ఆపేసిందని, కేంద్రం ఇవ్వాల్సిన పెండింగ్ నిధులు విడుదల చేయకుండా తెలంగాణ ప్రజలను బిజెపి ఇబ్బంది పెడితే తెలంగాణ సమాజం తిరగబడుతుంందని మోడీ ప్రభుత్వానికి హెచ్చరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వని పార్టీ బిజెపి అని, వరంగల్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని బిజెపి ఆపేసిందని, వరంగల్ రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్ కు తీసుకెళ్లారని మోడీ ప్రభుత్వాన్ని విమర్శించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలని నిలదీశారు. తెలంగాణలో ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం ఖాళీగా లేకుండా అన్నీ నింపుతామని చెప్పినట్టుగానే సిఎం కెసిఆర్ ఉద్యోగ నియామకాలు భర్తీ ప్రారంభించారని మంత్రి వెల్లడించారు.  మెడికల్ కళాశాలలు, నవోదయ పాఠశాలలు  మంజూరు చేయాలని వందలాది దరఖాస్తులు పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం కనికరం చూపడంలేదని మండిపడ్డారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News